పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 30: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ వెటర్నరీ విభాగంలో అసిస్టెంట్ గా పనిచేస్తున్న సుధాకర్ (48) ఉద్యోగికి పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ లోని పోలింగ్ బూత్ నెంబర్ 248 లో ఎన్నికల విధులు కేటాయించారు. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఏర్పాట్లు చేసుకుంటుండగా చాతిలో నొప్పి అంటూ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే సుధాకర్ ను పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలింగ్ విధులకు తమతో వచ్చిన సహచర ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడంతో మిగతా సిబ్బంది విషాదంలో మునిగిపోయారు.




