వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల నియామవళి అమలు, విధివిధానాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలను కలెక్టర్ నిర్దేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి ఎన్నికలు సాఫీగా, సజావుగా జరిగేలా సహకరించాలన్నారు. ఎన్నికల విధుల్లో పనిచేసే అధికారులు ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, క్రమశిక్షణతో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.ఎన్నికల నియమావళి ని ఉల్లంఘన పాల్పడ కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
గ్రామస్థాయి నుండి వివిధ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడల పై ఉన్న వ్రాతలను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పార్టీలు గానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గాని అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధనల ఉల్లంఘనను పాల్పడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకునేలా, ఓటు యొక్క ప్రాముఖ్యతపై స్వీప్ కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సౌకర్యాలతో పాటు వీల్ చైర్లు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచే విధంగా సంబంధిత అధికారులు సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్ , అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, అధనపు ఎస్పీ రవీందర్ రెడ్డి , ఆర్డీవోలు శ్రీనివాస్ రావు, విజయ కుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.





