కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి కుమారస్వామిని ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హైదరాబాద్ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకంలో విధులపట్ల నిర్లక్ష్యంతో పాటు కీలకమైన విచారణ కోసం న్యూఢల్లీిలోని షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ముందస్తు సూచనలు ఇచ్చినప్పటికీ గైర్హాజరు అయినట్లు తెలిపారు.
కార్యస్థానంలో అందుబాటులో ఉండకపోవడంతో వైద్య సేవల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పనితీరుపై జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాలకు హాజరు కావడం లేదన్నారు. ప్రజల ఇబ్బందులను గమనించి అతనిని సరెండర్ చేసినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో డాక్టర్ బి కుమారస్వామి సేవలు ఇకపై అవసరం లేదని భావించి పరిపాలనా ప్రయోజనాల దృష్ట్యా అతను విధుల పట్ల నిర్లక్ష్య వైఖరి తదితర అంశాల కారణాల వల్ల అతనిపై అవసరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.



