నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్లైన్కు ఆకర్శితులై తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఆత్మలు గత పదేళ్లుగా ఘోషిస్తున్నాయి. బతికున్న నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా పొట్ట చేత పట్టుకుని నానా యాతన పడుతున్నారు. సిఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరవాత ఒక్కో రంగంపై సవిూక్షిస్తూ సాగుతున్న తీరువల్ల ప్రజల్లో నమ్మకం కలుగుతోంది. ప్రధానంగా ఉద్యోగ నియామకాలు, ప్రైవేట్ ఫీజుల దోపిడీ, స్కూళ్ల మూసివేత వంటి వాటిపై చర్యలు తీసుకోవాలి. అలాగే నీళ్లు ఎవరికి పోయాయో గుర్తించాలి. కాళేశ్వరం పొడుగునా నీళ్లు ఎవరి పొలాలకు పారుతున్నాయో గుర్తించాలి. నియామకాలు ఎవరికి జరిగాయో..నిధులు ఎక్కడికి పోయాయో కూడా గుర్తించాలి. అప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. అమరుల ఆత్మలు శాంతిస్తాయి. ఈ క్రమంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం యూపీఎస్సీతో పాటు ఇతర రాష్టాల్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి సవిూక్షలో తీసుకున్న నిర్ణయాలు నిరుద్యోగులకు ఆశాజనకంగా మారింది.
ఇదొక్కటే కాకుండా గత పదేళ్లుగా లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశామని బుకాయించిన కెసిఆర్ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ ఉద్యోగాలు భర్తీ చేసిందో నిజాలు రాబట్టాలి. నిరుద్యోగులకు సంబంధించి తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా తెలంగాణ యువతకు భరోసా కల్పించేదే. గత పదేళ్లుగా డిఎస్సీలు కూడా నిర్వహించకుండా స్కూళ్లను మూసేసారు. దీనిపైనా విచారణ జరపాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనతో పాటు.. అవకతవకలకు కారకులైన వారిని గుర్తించి బోనులో నిలబెట్టాలి. అలాగే సర్వీస్ కమిషన్ ద్వారా ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసేలా దానిని సంస్కరించాలి. అర్హులైన వారికే పదవులు కట్టబెట్టి సమర్థతను పెంచాలి. యూపీఎస్సీతో తరహాలో దీనిని పటిష్ట సంస్థగా తీర్చిదిద్దాలి. అక్రమాలకు తావులేకుండా పక్కా ప్రణాళిక అమలు చేస్తే..మంచిది. ఇకపోతే గతంలో ఘంటా చక్రపాణి కమిషన్ ఛైర్మన్గా ఉన్న సమయంలో కొన్ని ఉద్యోగాల్లో కవిత ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనా విచారణ చేయాలి. కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పించాలి. అలాగే చైర్మన్, సభ్యుల నియామకాలను సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పారదర్శకంగా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. కమిషన్కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బంది, ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను సిఎం ఇప్పటికే ఆదేశించారు కనుక ఈ విషయంలోనూ నిరుద్యోగులు భరోసాతో ఉండవొచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి జరిగిన అవతవకలపై సమగ్ర విచారణ జరపాలి.
ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో ఇంటర్, పది పరీక్షల నిర్వహణ కూడా భ్రష్టు పట్టిపోయింది. ఈ విషయంలో వొచ్చిన ఆరోపణలపైనా సిఎం రేవంత్ సవిూక్షించి విచారణకు ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. త్వరలో జరుగనున్న పదోరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను గుర్తించి పరీక్షల సమయం లో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఉండే విధంగా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించినందున అధికారులు కూడా అందుకు తగ్గట్లుగా పనిచేయాలి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక అందచేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదికతోపాటు, రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు.
ప్రధానంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎక్కడ అవసరమో పరిశీలించి వాటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ప్రైవేట్ కార్పోరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపైనా దృష్టి సారించాల్సి ఉంది. లక్షల్లో ఫీజుల వసూళ్లను నియంత్రించాలి. పేద,మధ్య తరగతి ప్రజలకు పాఠశాల విద్యనఉ చేరువ చేసేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అంచనాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంతో ఆ విజయం లభించింది. అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆరు గ్యారంటీలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఆర్థికంగా బలపడేలా చూసుకోవాలి. ఆర్థిక దుబారాను అరికట్టడంతో పాటు, అధికారుల అవినీతిపైనా నిగ్గు తేల్చాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతేనే సమర్థత బయటపడగలదు. సమగ్ర దర్యాప్తుతోనే అవినీతి బయటపడగలదు. ఇప్పటికిప్పుడు కొత్తగా ఆలోచించుకుని సంపద సృష్టించుకుని వాటి ద్వారా ఆదాయాన్ని పెంచుకుని హావిూలు అమలు చేయాల్సి ఉంటుంది. మేనిఫెస్టోలో పెట్టిన ఇతర హావిూలు సంగతేమో కానీ.. ఆరు గ్యారంటీలను మాత్రం వంద రోజుల్లోనే అమలు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా అభివృద్ధి పనుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉండదు. అందుకే తెలంగాణలో అభివృద్ధిపై సమర్థంగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
`ప్రజాతంత్ర డెస్క్





