న్యూ దిల్లీ, డిసెంబర్ 20 : ఉత్తరాదిలో మళ్లీ చలి క్రమంగా పెరుగుతోంది. పొగ మంచుతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. చలి గాలులు, మంచుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 9 గంటలు అవుతున్నా చలి ఏ మాత్రం తగ్గడం లేదు. సాయంత్రం 5 గంటలు దాటితే చాలు క్రమంగా చలి మొదలై ఉధృత రూపం దాలుస్తోంది. పొగ మంచు కారణంగా ఫిరోజాబాద్ లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగింది.
వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. రోడ్డుపై ఉన్న వాహనాలు క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. చలి గాలులతో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. చలి సమస్యలతో వచ్చే వ్యాధుల కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు చెబుతున్నారు.



