హిమాయత్నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేసి గెలవడానికి బీజేపీ పార్టీ చూస్తుందని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. దీనికి భారత ఎలక్షన్ కమిషన్, తెలంగాణ సీఈఓ అధికారులు సహకరిస్తున్నారని దీనికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
కిషన్ రెడ్డిలు నేతృత్వం వహిస్తున్నారని విమర్శించారు. గత లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఈవీఎంలను టాంపరింగ్ చేసి బీజేపీ అధికారం అడ్డదారిలో చేపట్టారని అన్నారు. భారత ఎన్నికల పార్లమెంట్ ప్రజా స్వామ్యాన్ని మోడీ, అమిత్ షాలు ఖునీ చేసారని ఆరోపణలు చేసారు. ఈ దారుణానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మోడీ బీజేపీ సర్కార్ కి కీలు బొమ్మగా మారిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ఓటర్లకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు. కాబట్టి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్ తోనే నిర్వహించాలని ఇసిఐ అధికారులను డిమాండ్ చేసారు.





