- హత్యకు 20 కోట్లు ఖర్చు చేస్తానన్న ఎమ్మెల్సీ
- కెసిఆర్ ప్రోద్భలంతోనే చెలరేగుతున్న కౌశిక్ రెడ్డి
- ఈటల సతీమణి జమున సంచలన ఆరోపణలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు పాడి కౌశిక్ రెడ్డి కుట్ర పన్నారని ఆయన సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈటల జమున వి•డియాతో మాట్లాడుతూ…బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి..ఈటల రాజేందర్ హత్యకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఈటల హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన అనుచరులతో అన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నారని జమున వ్యాఖ్యానించారు. మా కుటుంబ సభ్యులది ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆర్దే బాధ్యతని అన్నారు. కౌశిక్ రెడ్డి ఓ పిచ్చికుక్క. తెలంగాణ ఉద్యమకారులంటే.. మొదట వినిపించే పేరు ఈటల రాజేందర్. పిచ్చి కుక్కను సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ చేసి హుజూరాబాద్ ప్రజల వి•దకు వదిలారు. హుజురాబాద్లో పిచ్చి కుక్క అరాచకాలు పెరిగిపోయాయి.
హుజూరాబాద్ ప్రజలు, మహిళల పట్ల ఇష్టానుసారంగా పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ పిచ్చి చేష్టలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి. అమరవీరుల స్థూపాన్ని ఉద్యమంలో లేని పిచ్చికుక్క కూల్చివేయించాడు. అమరవీరుల స్థూపం తాకే అర్హత ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డికి లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్థూపం పునర్నిర్మాణం కోసం ఉద్యమం చేస్తాం. శిలాఫలకంపై ఈటల రాజేందర్ పేరు ఉండకూడదన్న ఉద్దేశంతోనే కౌశిక్ రెడ్డి కూల్చి వేయించారు. ఉద్యమకారులను కొట్టించిన వ్యక్తి కౌశిక్ రెడ్డి. అమరవీరుల స్థాపాన్ని కూల్చిన వ్యక్తిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. మహిళా గవర్నర్ను ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం చర్యలు తీసుకోలేదు. హుజూరాబాద్ను మంత్రి కేటీఆర్ కౌశిక్ రెడ్డికి అప్పజెప్పాలని చూస్తున్నారు. ఈటల రాజేందర్ పుణ్యాన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వొచ్చింది. హుజురాబాద్ కో-సర్పంచ్లపై కౌశిక్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడతారన్న నమ్మకంతో హుజూరాబాద్లో ఈటలను గెలిపించారు. ఇప్పుడు గుర్తింపు కోసం ఈటలను కౌశిక్రెడ్డి తిడుతున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్ పార్టీ మార్పు ప్రచారం మాత్రమే. బీజేపీలో మేము సంతృప్తికరంగా ఉన్నాం. బీజేపీలో ఈటలకు ప్రాధాన్యత లేదనేది అవాస్తవం. పదవుల కోసం ఈటల రాజేందర్ తల వంచరు..పాకులాడరని జమున తెలిపారు. అయితే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ఈటల జమున స్పష్టం చేశారు. ఈటలను చంపేస్తామంటే తాము భయపడిపోమని, కౌశిక్ రెడ్డి మాటల వెనక సీఎం కేసీఆర్ ఉన్నారని, వోటుతో ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్తారన్నారు. కౌశిక్ రెడ్డిని..కేసీఆర్ హుజూరాబాద్ ప్రజలపైకి ఉసిగొల్పారని, ఆయన హుజూరాబాద్లో అరాచకాలు సృష్టిస్తున్నారని జమున ఆరోపించారు.
బట్టలు మార్చినంత ఈజీ కాదు : ఈటల
బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చలేమని,పార్టీ మార్పు ప్రచారంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారలేమని, అన్ని పార్టీల్లో అభిప్రాయభేదాలు సహజమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా హైకమాండ్కు ఫిర్యాదు చేయలేదని, హైకమాండ్ పిలిస్తేనే ఢిల్లీకి వెళ్లానని వివరించారు. హైకమాండ్ పిలవకుండా ఎప్పుడూ ఢిల్లీకి వెళ్లలేదని, టిఆర్ఎస్ తనను బయటకు వెళ్లగొడితే.. బీజేపీ అక్కున చేర్చుకుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
తెలంగాణలో విజయ తీరాలను ముద్దాడేది బీజేపీనేనని ఈటల రాజేందర్ దీమా వ్యక్తం చేశారు. చాపకింద నీరులాగా పని చేసుకుంటూ వెళ్తున్నామని, 9 సంవత్సరాల కాలంలో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని ఈటెల రాజేందర్ చెప్పారు. ఎప్పుడూ ఒకేలాగా గ్రాఫ్ ఉండదని, తగ్గుతూ, పెరుగుతూ ఉంటుందన్నారు. పార్టీ ఎదుగుదల కింది స్థాయి నుంచి రావాలని, బీజేపీకి కిందిస్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.




