‘‘ఆర్థికపరంగా రిజర్వేషన్లు చేయడం సరికాదని ఇంద్రసావని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గతంలో సుప్రీం కోర్టు తీర్పు కూడ వెలువరించింది. యూత్ ఫర్ ఈక్వాలిటి సంస్థ ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కల్పించడం తప్పని వాదిస్తూనే ఆ చట్టం నుండి అదేఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాల వారిని మినహాయించడం తప్పని వాదిస్తుంది.’’
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాలలో చాలా విస్తృతంగా ప్రభావం చూపినటు వంటి విషయాలలో రిజర్వేషన్ల అంశం ఒకటి. మన రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించారు. రాజ్యాంగంలోని 15వ అధికరణం ప్రకారం జాతి, కుల, మత, లింగ సంబంధమైన ఎలాంటి వివక్షణ చూపరాదు. 16వ అధికరణం మేరకు ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరు లందరికి సమాన అవకాశాలు కల్పించ బడ్డాయి. 16 (4) అధికరణం ప్రకారం వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. వెనుక బడిన వర్గాలు, జాతుల సమూహాలు అన్నిఅవకాశాలు ఉన్న ఉన్నత కులాల వారితో ఎలాంటి ప్రత్యేక చేయూత లేకుండా పోటిపడ లేరు. ఉన్నత కులాల వారికి ఉన్నటువంటి ఇంతవరకు అందినటు వంటి అవకాశాలు ప్రత్యేకించి నిమ్నకులాలు, జాతుల వారికి కల్పిస్తేనే సమానత్వపు హక్కులు అందరికి సిద్దించినట్లు అవుతుంది అనే భావనతో రాజ్యాంగంలో వీరికి ప్రత్యేక సదుపాయాలు పొందు పరిచారు. తరతరాలుగా సామాజికంగ, ఆర్థికంగ, విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడిన వారికి ప్రత్యేక అవకాశాలు ఇవ్వాలని నిర్దేశించారు. అయితే రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఈ సామాజిక మరియు విద్యాపరమైన వెనుక బాటు తనానికి నిర్వచనం లేదు. అన్ని దేశాల్లో లాగానే భారత దేశంలో అంచలంచెలా సాంఘిక వ్యవస్థ శతాబ్దాలుగా అమల్లోఉంది. ఇలాంటి వ్యవస్థ ద్వారా దిగువన ఉన్నటు వంటి అధిక జనాభా కలిగిన వెనుక బడిన జన సమూహాలు ఏ అవకాశాలు లేక సాంఘికంగా వివక్షకు గురవుతూ విద్యాగంధానికి నోచుకోక సమాన అవకాశాలు పొందలేక అట్టడుగున ఉండిపోయారు.
మొట్ట మొదట అందరికన్న అత్యంత వెనుకబాటు తనంలో ఉన్న షెడ్యూలు కులాలు , షెడ్యూల్డ్ తెగల వారికి ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఇతర వెనుకబడిన బిసి కులాల వారికి ఈ అవకాశాలు దక్కలేదు.వెనుకబడిన కులాల వారి స్థితి గతులు వారి సామాజిక పరిస్థితులు అవగాహన చేసుకుని 1979లో అప్పటి ప్రధాన మంత్రి మురార్జీ దేశాయ్, పార్లమెంటు సభ్యుడు బీహార్ మాజి ముఖ్యమంత్రి అయిన బీపీ మండల్ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ 1931 లో బ్రిటిష్ ప్రభుత్వంలో సేకరించిన ఇతర వెనుక బడిన తరగతులకు సంబందించిన గణాంకాల ఆధారంగా దేశంలో ఓబీసీల శాతం 44 ఉన్నదని వీరికి 27% రిజర్వేషన్లు కల్పించడం సమంజసం అని సూచించింది. కానీ దానిని అమలు జరపక ముందే మురార్జి దేశాయి దిగిపోవడం ఆ తరువాత మళ్లీ ఇందిరా గాంధీ రావడం తో మండల్ కమీషన్ సిఫార్సులు అమలు కాలేదు.
1990లో వీపీసింగ్, ఆనాటి ప్రధాన మంత్రి మండల్ కమీషన్ సిఫార్సుల ఆధారంగా రిజర్వేషన్లపై చట్టం చేసి అమలు పరిచాడు. దీన్ని వ్యతిరేకిస్తూ దేశం మొత్తం అగ్ర కులాల వారు ఉద్యమాలు లేవదీశారు. రిజర్వేషన్లను సవాల్ చేస్తు సుప్రీం కోర్టులో కేసు వేసారు. ఇదే ఇంద్ర శాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (×అ•తీ• •••ష్ట్రఅవ• ఙ• ఖఅఱశీఅ శీ• ×అ•ఱ• •••వ ). ఈకేసులో సుప్రీం కోర్టు ఇతర వెనుకబడిన కులాలకు ఇరవై ఏడు శాతం ఉన్నత విద్యా సంస్థల్లో ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేననే చట్టం అమలును బలపరిచింది. అంతే కాకుండా మొత్తం రిజర్వేషన్లు 50% మించ కూడదని కూడా తీర్పుచెప్పింది. అప్పటి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిమితులకు లోబడి రిజర్వేషన్ విధనాన్ని పాటిస్తూ వచ్చాయి. ఒక్క తమిళనాడులోమాత్రం రిజర్వేషన్లు 69% వరకు పెంచారు. ఆ రాష్ట్ర ఒత్తిడి వల్ల పార్లమెంటు 76వ సవరణ ద్వారా ఈ రిజర్వేషన్లు ఆమోదించబడి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఇప్పుడు అది కోర్టు పరిధి లోకి రాకుండా శాశ్వతమైంది. బీహార్, ఉత్తర ప్రదేశ్ ఇతర రాష్ట్రాలు ఇలాంటి రిజర్వేషన్లు పెంచేందుకు ప్రయత్నం చేసిన ఇంత వరకు సఫలం కాలేక పోయాయి.
77వ సవరణ ద్వారాఎస్సీ,ఎస్టీ కులాల వారికి ప్రమోషన్లలో కూడ రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఈ వెసులు బాటు బీసీలకు కల్పించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
అయితే 2019లో మోడీ ప్రభుత్వం 103వ సవరణ ద్వారా ఇప్పటి వరకు రిజర్వేషన్లు అనుభవిస్తున్నకులాల వారు కాకుండా ఆర్థికంగా వెనుక పడిన కులాల ప్రజలు అంటే అగ్రకులాల వారికి 10% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత విద్యాసంస్థలలో రిజర్వేషన్లు కల్పించారు. దీనిని వ్యతిరేకిస్తూ యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థ సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఈ కేసు విషయం ఇప్పుడు సుప్రీం కోర్టు పరిశీలిస్తోంది.
ఈ సంస్థ ఈ విధమైన ఆర్థిక స్తోమత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఏక పక్ష నిర్ణయ మని, అది సామాజిక వెనుక బాటు కారణంగా విద్యా పరమైన రిజర్వేషన్లు సాధించి నటువంటి సమానత్వానికి విఘాతం కల్పిస్తుందని, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తుందనేది వారి వాదన. వీరి వాదనకు వ్యతిరేకంగా ప్రభుత్వం సుప్రీం కోర్టులో ప్రతివాదనలు దాఖలు చేసింది. ఎవరిని సంప్రదించకుండానే మోదీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏకపక్ష నిర్ణయ మని, ఇది ప్రజాస్వామ్య సూత్రానికి విరుద్ద మని సంస్థ వాదన. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కల్పించేందుకు వీలు లేదని సామాజికంగా విద్యాపరంగా వెనుక పడిన కులాల వారికే రిజర్వేషన్లు కల్పించాలని ఉందని గట్టిగా వాదిస్తున్నారు.
ఆర్థికపరంగా రిజర్వేషన్లు చేయడం సరికాదని ఇంద్రసావని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గతంలో సుప్రీం కోర్టు తీర్పు కూడ వెలువరించింది. యూత్ ఫర్ ఈక్వాలిటి సంస్థ ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కల్పించడం తప్పని వాదిస్తూనే ఆ చట్టం నుండి అదేఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాల వారిని మినహాయించడం తప్పని వాదిస్తుంది.ప్రభుత్వం నుండి ఏ సహాయం పొందని ఉన్నత విద్యాసంస్థలకు ఈ చట్టాన్ని అమలు పరచక పోవడం అన్యా యమని కూడా ఈ సంస్థ పేర్కొంది. ఈ సంస్థ ప్రధాన వాదన ఏంటంటే అసలు అగ్ర వర్ణాల ఆర్థిక వెనుక బాటు తనం గురించి ఎలాంటి సర్వే జరగనే లేదని వారి గురించి ఎలాంటి గణాంకాలు లేవని, ఏదో రాజకీయ లబ్దికోసం రిజర్వేషన్లు కల్పిం చారని వ్యతిరేకిస్తోంది. ఏ రిజర్వేషన్ల ద్వారా సమాన త్వాన్నిసాధించే ప్రయత్నం ఇన్ని దశాబ్దాలుగా జరిగిందో ఇప్పుడు ఆ సమానత్వానికి 103వ సవరణ ద్వారా విఘాతం ఏర్పడుతున్నదని ఈసంస్థ వాదన.
కానీ ఒక విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 75 సంవత్సరాల్లో రిజర్వేషన్ల వలన వెనుక బడిన సమూహాల వారికి లాభం చేకూరింది అనే విషయం నిజం. రిజర్వేషన్ల ద్వారా రెండు తరాల వారికి చక్కటి అవకాశాలు లభించడం వల్ల రిజర్వేషన్ అమలు గాని 50% లో కూడా వీరు పోటీ పడి ఉన్నత విద్యాసంస్థల్లో మరియు ఉద్యోగాలలో వీరియొక్క పోటీతత్వం పెంచుకొని ఆ సంస్థల్లో వీరిసంఖ్య గణనీయంగా పెంచుకున్నారు అనేది ఒక వాదన. ఏదైనప్పటికీ సంస్థ వాదిస్తున్నట్లు ఇప్పుడు అటు విద్యాసంస్థల్లో ఇటు ప్రభుత్వ ఉద్యోగాలలో రకరకాల కులాల నుండి ఎంత మేరకు ప్రాతినిధ్యం ఉంది అనే విషయాన్ని ఒక ప్రత్యేక సర్వే ద్వారా నిర్ణయించి తద్వారా ఈ చట్టం రూపకల్పన చేస్తే పరిష్కారం లభిస్తుందా అనేది న్యాయ నిపుణులు అబిప్రాయాలు తీసుకుంటే మంచిదనే ఓ అబిప్రాయం ఉంది..
తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ మద్య ముస్లిం ల రిజర్వేషన్లపై వాగ్వివాదం ఉంది. రాజ్యంగ నిపుణుల వాదన ఏంటంటే ‘‘సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుక బాటు తనం’’ అనే పదాల ద్వారా రిజర్వేషన్లు కల్పించబడ్డాయి కానీ అందులో మతాలకు సంబంధించిన ప్రస్తావన లేదు. కాబట్టి ఆ ప్రాతిపదికన సామాజికంగా మరియు విద్యాపరంగ వెనుకబడిన మతాల వారికి రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉందని వీరి వాదన. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగా అసలు ముస్లింలకి రిజర్వేషన్లు పొందే అవకాశమే లేదన్నట్టు వాదిస్తున్నది. తెలంగాణలో ప్రస్తుతం ముస్లిం వర్గాల వారికి నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈశాతాన్ని 12 శాతానికి పెంచేందుకు ప్రయత్నం చేస్తే కేంద్రం అడ్డుపడింది. కేరళలో ఇప్పటికే ముస్లింలకి 12% విద్యాసంస్థల్లో, 10% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉన్నాయి.
ఎవరి వాదనలు ఎట్లున్నా సుప్రీంకోర్టు నిర్ణయం ఈ విషయంలో సంచలనాత్మకం కాబోతుంది.
– డాక్టర్ మండువ ప్రసాద రావు, 9963013078




