నిర్లక్ష్యానికి నిలయంగా మాతా శిశు సంక్షేమ కేంద్రం
ఆక్సీజన్ అందక నాలుగు నెలల పసిపాప మృతి
ఆక్సీజన్ అందక కాదు జన్యుపర వ్యాధితోనే మృతి:హాస్పిటల్ సూపరింటెండెంట్
కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 07 : కాన్పు సమయంలో చిన్నారి చిట్టి చెయ్యి విరిచిన సంఘటన మరువక ముందే మాతా శిశు సంక్షేమ కేంద్రంలో మరో హృదయ విధారక సంఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం పోయింది. భదాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మరో దారుణం జరిగింది. మొన్న చెయ్యి ఇప్పుడు ఏకంగా ఆయువు తీశారు. ఆక్సీజన్ అందక ఆ చిన్ని గుండె ఎంతలా విల విలలాడిందో తలుచుకుంటే ప్రాణం తరుక్కు పోతుంది. డీజిల్ బిల్లుల పేరిట నెల నెల వేలకు వేల రూపాయలు డ్రా చేస్తూ ఖజానాకు గండి కొడుతూ ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది. కరెంటు పోయినా జనరేటర్ ఆన్ చేయక చిన్నారి చావుకు కారణం అయ్యారు అక్కడి సిబ్బంది. హాస్పిటల్లో కరెంట్ లేని సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఉండేందుకు, అత్యవసర సేవలలు నిలిచిపోకుండా నిరంతరం కరెంట్ ఉండేలా జనరేటర్ అందుబాటులో ఉంచారు.
ఆరోగ్య కేంద్రంలో కరెంటు లేకపోయేసరికి ఆక్సిజన్ అందక నాలుగు నెలల పసిపాప ప్రాణాలు గాలిలో కలిసింది. చుంచుపల్లి మండలం విద్యా నగర్ కాలనీకి చెందిన కరీముల్లా, తస్లీమ్ దంపతుల నాలుగు నెలల పసి పాప బాజీ ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతుంది. పలు కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం చేయించారు. బాజీకి కృత్రిమంగా ఆక్సిజన్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని డాక్టర్లు వెల్లడించారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నా కరీముల్లా తస్లిం దంపతులు ఉన్నదంతా వైద్యానికి ఖర్చు చేశారు. చిన్నారికి వైద్యం అందించే ఆర్ధిక స్థోమత లేక స్థానికంగా ఉన్న రామవరం లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అడ్మిట్ చేశారు. గడచిన మూడు రోజులుగా ప్రత్యేక పరికరం సహాయంతో అందిస్తున్న కృత్రిమ ఆక్సిజన్ సహాయంతో బాగానే ఉంది బాజి.
గురువారం పొద్దున హాస్పిటల్లో కారెంట్ పోవడంతో సిబ్బంది జనరేటర్ ఆన్ చేయలేదు. దీంతో అరగంట పాటూ కరెంట్ నిలిచిపోడంతో చిన్నారికి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిందని పాప తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. హాస్పిటల్లో జనరేటర్ సదుపాయం ఉన్నా సిబ్బంది దానిని వినియోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ బిడ్డ ప్రాణాలను బలిగొన్నారని చిన్నారి తల్లిదండ్రి ఆక్రోశించారు. సిబ్బంది అలసత్వమే పాప ప్రాణాలు కోల్పోవడానికి కారణమంటూ హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా చర్యలు తీసుకోవాలని తండ్రి కరీముల్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసత్య ఆరోపణలు… ఆక్సీజన్ అందక కాదు జన్యుపర వ్యాధితోనే మృతి : హాస్పిటల్ సూపరింటెండెంట్
బాజీ అనే చిన్నారి అరుదైన జన్యు పరమైన వ్యాధితో బాధపడుతుందని, అలాంటి వ్యాధి 3 వేల మందిలో ఒక్కరికి వొస్తుందని, హైదరాబాద్లోని నిలోఫర్ హాస్పిటల్ వర్గాలు దీనిని నిర్ధారించాయని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుమారస్వామి తెలిపారు. పాప ఫైనల్ మస్క్యూలర్ ఎంట్రోఫీ కండీషన్ (ఎఫ్ఎంఈసీ)తో బాధపడుతుందని, ఈ వ్యాధితో బాధపడేవారు కండరాలు నిర్జీవంగా మారి నరాలు చచ్చుడబడి గుండె, ఊపిరి తిత్తుల పనితీరు క్రమేపి మందగించి చివరికి మరణిస్తారని, చిన్నారి బాజీ విషయంలో ఇదే జరిగిందని, ఆక్షీజన్ సప్లై అందక కాదని, గతంలోను ఇదే సమస్యతో ఈ దంపతులకు చెందిన చిన్నారి మృతి చెందిందని సూపరింటెండెంట్ వివరించారు.



