- వారికి కుటుంబ రాజకీయాలే ముఖ్యం
- అవినీతిలో బెయిల్పై ఉంటే అదనపు అర్హత
- ఇలాంటి వారంతా దేశం గురించి ఆలోచిస్తారా?
- విపక్షాల బెంగళూరు భేటీపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు
- అండమాన్ నికోబార్లో ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని
న్యూ దిల్లీ, జూలై 18 : కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపణలు చేశారరు. వారికి కుటుంబ రాజకీయాలు తప్ప దేశహితం పట్టదని ఘాటుగా విమర్శించారు. బెంగళూరులో విపక్షాల సమావేశంపై ప్రధానమంత్రి మోదీ విమర్శలు గుప్పించారు. మంగళవారం అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని పోర్టుబ్లెయిర్లో వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విపక్షాలు సొంత లాభం కోసమే పని చేస్తున్నాయని ఆరోపించారు. యూపీఏ పాలన, విపక్షాల భేటీలను ఎద్దేవా చేశారు. 9 ఏళ్లల్లో తాము ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పాటు చేసిన కొత్త టెర్మినల్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇలా దేశంలోని ఏ మూలకు వెళ్లినా తాము చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. గత యూపీఏ పాలనలో అభివద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు మోదీ. కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తంటాయని వారిని కాపాడుకోవడమే వారి ప్రధాన లక్ష్యం అన్నారు.
బెంగళూరు, పాట్నాలో విపక్షాల సమావేశాలను నేరుగా ప్రస్తావించకుండానే వారిపై ఆరోపణలు చేశారు. అభివృద్ధి కాకుండా కుటుంబాలను కాపాడుకోవడానికే కొన్ని పార్టీ పని చేస్తుంటాయని వారి తాపత్రయం కూడా అదేనని అన్నారు మోదీ. తాము మాత్రం దేశం కోసం ఆలోచిస్తూ ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగళూరులో సమావేశమైన పార్టీలకు ఒకే ఒక మంత్రం ఉందని, అది.. కుటుంబం యొక్క, కుటుంబం ద్వారా, కుటుంబం కోసం అని వివరించారు. అందుకే ప్రజలు 2024లో మళ్లీ ఎన్డీయేను అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్నారన్నారు. భారత దేశ దుఃఖానికి బాధ్యులైనవారు ఇప్పుడు తమ దుకాణాలను తెరిచారని చెప్పారు. ఈ దుకాణాల్లో కులతత్త్వ విషం, విపరీతమైన అవినీతి గ్యారంటీగా దొరుకుతాయన్నారు. ఇప్పుడు ఈ పార్టీలు బెంగళూరులో ఒకే వేదికపైకి వచ్చాయన్నారు.
ఈ ప్రతిపక్షాలు ఓ పాట పాడుతున్నాయని, అయితే వాస్తవం వేరొకటి ఉందని చెప్పారు. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజీవ్రాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇది కట్టర్ అవినీతి సమ్మేళనమని ప్రజలు అంటున్నారు. ఈ సమావేశానికి గల మరొక ప్రత్యేకత ఏమిటంటే, కోట్లాది రూపాయల అవినీతి కేసులో బెయిలు వి•ద బయట ఉన్నవారిని ఎంతో గౌరవంతో చూస్తున్నారు. మొత్తం కుటుంబ సభ్యులంతా బెయిలు వి•ద ఉంటే, మరింత ఎక్కువగా గౌరవిస్తున్నారు. ఓ జన సముదాయాన్ని అవమానించినందుకు కోర్టు శిక్షిస్తే, అలా శిక్ష పొందినవారిని గౌరవిస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జరిగిన హింసాకాండను ప్రస్తావిస్తూ, బెంగళూరు సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష నేతలను వారిపై వొచ్చిన అవినీతి ఆరోపణల గురించి అడిగినపుడు, వారు మౌనంగా ఉన్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయని, దీనిపై వీరంతా మౌనాన్ని ఆశ్రయించారని చెప్పారు. తమను కాపాడాలని కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలు వేడుకున్నప్పటికీ, వారి నేతలు మాత్రం స్వార్థపూరిత రాజకీయాల కోసం వారిని దయనీయ పరిస్థితుల్లో వదిలేశారన్నారు.
తమిళనాడులో అవినీతి కేసులు చాలా ఉన్నాయన్నారు. ఈ కేసులు ఇప్పుడిప్పుడే బయటకు వొస్తున్నాయని, నిందితులకు ప్రతిపక్ష నేతలు క్లీన్ చిట్ ఇస్తున్నారని తెలిపారు. బెంగళూరులో జరుగుతున్నది స్వచ్ఛమైన అవినీతి సమావేశమని ప్రధాని ఆరోపించారు. ఈ పార్టీలకు అభివృద్ధిపై దృష్టి లేదని, కొన్ని పార్టీలు తమ వంశపారంపర్య వారసత్వ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాయని, దేశ ప్రయోజనాలు, సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రజాస్వామిక వ్యవస్థలో వారసత్వ రాజకీయాలకు ప్రతిపక్ష పార్టీలు గుడ్డిగా మద్దతిస్తున్నాయన్నారు. రూ.20 లక్షల కోట్ల అవినీతి గ్యారంటీతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయని మండిపడ్డారు. అందరినీ కలుపుకొనిపోతూ, అందరికీ అవకాశాలు లభించే సరికొత్త అభివృద్ధి నమూనాకు తాను కట్టుబడి ఉన్నానని మరోసారి మోదీ తెలిపారు. తన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, అండమాన్ అండ్ నికోబార్ దీవులు అభివృద్ధి చెందినట్లు చెప్పారు. ఇక ఎన్డీయేకు వ్యతిరేకంగా బెంగళూరులో జరుగుతున్న సమావేశంలో 26 పార్టీలు పాల్గొంటుండగా, న్యూ దిల్లీలో జరిగే ఎన్డీయే పక్షాల సమావేశానికి 38 పార్టీలు హాజరుకాబోతున్నాయని తెలుస్తుంది.



