- కొండగట్టు టెంపుల్కు ప్రకటించిన 6 వందల కోట్లు వెంటనే విడుదల చేయాలి
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో ఆలయం అభివృద్ధి
- ప్రభుత్వ వైపల్యాలను నిలదీసేందుకే ‘హత్ సే హత్జోడో’ యాత్ర
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం
- కొండగట్టు అంజన్నను దర్శించుకున్న రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రేవంత్ రెడ్డి ‘జోడో’ యాత్ర….ప్రజల్లో అనూహ్య స్పందన
జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 6 : జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ప్రకటించిన 600 కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్లో బస చేసిన ఆయన సోమవారం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా విలేఖరులతో మాట్లాడుతూ…అబద్దపు హామీలతో కేసీఆర్ దేవుళ్ళను, భక్తులను మోసం చేస్తుండని విమర్శించారు. కచ్చితమైన ప్రణాళిక లేకుండా కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి 100 కోట్లు కేటాయించి, మరోసారి అదనంగా 500 కోట్లు ఇంకా చాలకపోతే వెయ్యి కోట్లు ఇస్తానని నోటికి ఎంత వస్తే అంత అబద్ధంపు హామీ ఇచ్చిదేవుళ్లను మోసం చేస్తుండని విమర్శించారు.
తండ్రి బాటలోనే కూతురు నడుస్తుందని, హనుమాన్ చాలీసా కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్సీ కవిత కొండపై 125 అడుగుల అంజన్న విగ్రహం ఏర్పాటు చేస్తానని అబద్దపు హామీ ఇచ్చిందని ఇక్కడ పలువురు తన దృష్టికి తీసుకవచ్చినట్లు తెలిపారు. 600 ఏళ్లకు పైగా చరిత్ర కల్గిన కొండగట్టు అంజన్న ఆలయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా అభివృద్ధి చేయాలన్నారు. కొండ చుట్టూ ఉన్న 800 ఎకరాల అటవీ స్థలంతో గొప్పగా అంజన్న క్షేత్రం అభివృద్ధి చేయొచ్చన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక కొండగట్టు అంజన్న క్షేత్రన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రభుత్వ వైపల్యాలను నిలదీసేందుకే యాత్ర
ప్రజా సమస్యలు తెలుసుకోని, ప్రభుత్వ వైపల్యాలను నిలదీసేందుకు హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం తీసుకున్నామని టీపీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి తెలిపారు. గత నెల 6న ప్రారంభమైన జోడో యాత్రకు మంచి స్పందన ఉందని చెబుతూ రాబోయే ఎన్నికల్లో దేశంలో, రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ గౌడ్, అంజనీప్రసాద్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జి మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ నాయకులు దొంగ ఆనందరెడ్డి, దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, చారి, ముత్యం శంకర్ గౌడ్, ఎండీ ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.
టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
కొండగట్టు అంజనేయస్వామి దర్శణానికి వొచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అర్చకులు, అధికారులు రేవంత్ రెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి అంజన్న స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ అధికారులు అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదం అందజేసి సన్మానించారు.
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రేవంత్ రెడ్డి ‘జోడో’ యాత్ర….ప్రజల్లో అనూహ్య స్పందన
వేములవాడలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. అభిమానులు తమ ప్రేమను కుమ్మరించారు. జననేత స్పర్శ కోసం తపిస్తూ తనివితీరా చూడాలని ఉవ్విళ్లూరారు. ప్రతి గుండె తమ కష్టాన్ని చెప్పుకోవాలని తహతహలాడింది. అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనకు చరమ గీతం పాడేందుకు సమరశంఖం పూరించిన పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సాగిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్ర వేములవాడలో ఉరిమే ఉత్సాహంతో కదం తొక్కింది. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. జయహో రేవంతన్న అంటూ నినదించారు. సడలని సంకల్పంతో యాత్ర వేములవాడలో కార్నర్ మీటింగ్తో ఆదివారం రాత్రి విజయవంతంగా ముగిసింది.



