- ఉద్యోగ నియామకాలకు చర్యలు
- నేటి నుండి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ
- రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
- రూ.156.32 కోట్లతో జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాలకు పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లోని గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఒక్క రోజే రూ.156.32 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందచేశారు. కోహీర్, జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…కోహిర్ మండలం దిగ్వాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపి బ్లాక్ను ప్రారంంభించామని, దీన్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు.
ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీల సంఖ్య పెరిగిందని, రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా అగ్ర స్థానంలో ఉండని అన్నారు. హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీని తలపించే విధంగా దిగ్వాల్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇండ్లు చూసారా అంటూ ప్రశ్నించారు. అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావాలంటే లంచాలు ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో రెండు పడక గదుల ఇండ్లను నిర్మించి ఉచితంగా మీ చేతుల్లో పెడుతున్నామని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని స్పష్టం చేశారు. ఖాళీ జాగా వున్న వారికి ఇండ్లు నిర్మించుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమంను చేపట్టనున్నట్లు తెలిపారు. రూ.5కోట్ల 60 లక్షల వ్యయంతో 88 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను దిగ్వాల్లో నిర్మించామని తెలిపారు. రూ.156.32 కోట్లతో జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక్క రోజే చేపడుతున్నామని అన్నారు.
మాజీ మంత్రి గీతారెడ్డి హయాంలో త్రాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసూతులు, వైద్య సేవలు అందించడంలో, బూస్టర్ డోస్ ఇచ్చే విషయంలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, అందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, వైద్యులు, వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణాలో మంచి వైద్యాన్ని, విద్యను అందిస్తున్నామని తెలిపారు. బుధవారం నుండి రైతులకు రైతు బంధు డబ్బులు తమ ఖాతాలో వేసి రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ఉన్నట్టు వంటి సంక్షేమ పథకాలు ఎక్కడ లేవని స్పష్టం చేశారు. కోహీర్లో 10 కోట్లతో 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్ని నిర్మిస్తున్నామని, రెండు,మూడు నెలల్లో దాన్ని అందుబాటులోకి తేనున్నామని అన్నారు. త్వరలో సంగమేశ్వర, బసవేశ్వర సాగునీరు ప్రాజెక్ట్లతో గోదావరి జలాలను జహీరాబాద్ తీసుకొచ్చి ఈ ప్రాంత రైతులకు సాగునీటిని అందిస్తామని అన్నారు.
తెలంగాణ భూముల రేట్లు పెరగడానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అని మంత్రి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది. మీ కోసం ఎవరు పని చేస్తున్నారో మీరే గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎంపీ బిబి పాటిల్, రాష్ట్ర హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ శాఖ చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ మాట్లాడారు. కార్యక్రమల్లో ఇంకా అదనపు కలెక్టర్లు రాజహర్షి షా, వీరా రెడ్డి, డిసిఎమ్ ఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, సిడిసి ఛైర్మెన్ ఉమాకాంత్ పాటిల్తోపాటు ఆయా మండలాల ఎంపిపిలు, జడ్పిటీసీలు, ఎంపిటీసీలు, సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




