- ఇస్లామిక్ దేశాల వ్యాఖ్యలపై భారత్ మండిపాటు
- ఓఐసి ప్రకటనపై ఘాటుగా స్పందించిన విదేశాంగ శాఖ
న్యూ దిల్లీ, జూన్ 6 : మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం అంతకంతకూ పెరుగుతుండటం, సౌదీ అరేబియా, ఆప్ఘనిస్థాన్, ఆర్గనేజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దీనిపై ప్రకటనలు చేయడంపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఓఐసీ వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని, సంకుచితమని సమాధానం ఇచ్చింది. మైనారిటీల విషయంలో పాక్ రికార్డు అందరికీ తెలిసిందేనని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఆ ఇద్దర్నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బీజేపీ నేతల వ్యాఖ్యలపై పలు ఇస్లామిక్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, పాకిస్థాన్ సైతం గొంతు కలిపింది. భారత రాయబారిని పిలిపించి అసంతృప్తి వ్యక్తం చేసింది. బహ్రెయిన్ కూడా ఈ వివాదంపై స్పందించినప్పటికీ, నుపుర్, నవీన్ కుమార్పై తీసుకున్న చర్యలను అభినందించింది. కాగా, ఈ విమర్శలపై భారత ప్రభుత్వం బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా సంయమనం పాటిస్తూనే, ఓఐసీ వ్యాఖ్యలను తిప్పికొట్టింది. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరవింద్ బాగ్చి ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత్పై ఆర్గనేజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ జనరల్ సెక్రటేరియట్ ఇచ్చిన ప్రకటన తాము చూశామని, ఆ ప్రకటన పూర్తిగా అనుచితమని, సంకుచిత మనస్తత్వంలో చేసినవని, భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని మతాల పట్ల అత్యంత గౌరవభావం భారత ప్రభుత్వానికి ఉందన్నారు. మత ప్రముఖులను కించపరచే కామెంట్లు, ట్వీట్లు ఎవరైనా వ్యక్తిగతంగా చేస్తే, అధి భారత ప్రభుత్వ అభిప్రాయంగా భావించడం సరికాదన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. ఓఐసీ మరోసారి ఉద్దేశపూర్వకంగా, తప్పుదారి పట్టించే విధంగా కామెంట్లు చేయడం విచారకరమని బాగ్చి అన్నారు. ఇది ఓఐసీ తీరును, స్వార్థ ప్రయోజనాల కోసం విభజన ఎజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను బహిర్గతం చేస్తుందని అన్నారు. కమ్యూనల్ అప్రోచ్కు స్వస్తి చెప్పండి. అన్ని మతాలు, విశ్వాసాలను గౌరవించండి అంటూ ఓఐసీకి బాగ్చి హితవు పలికారు.




