అదానీ గ్రూప్‌పై సమగ్ర చర్చ జరగాలి

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : మోసం, షేర్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కుంటున్న అదానీ గ్రూప్‌పై సమగ్ర చర్చ జరగాలని కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ సోమవారం డిమాండ్‌ ‌చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండేండ్లుగా తాను ఈ అంశాన్ని లేవనెత్తుతున్నానని చెప్పారు. కోట్ల రూపాయల అవినీతితో పాటు దేశ మౌలిక సదుపాయాల వ్యవస్ధను ఓ వ్యక్తి హైజాక్‌ ‌చేశారని రాహుల్‌ ఆరోపించారు. ఆదానీ గ్రూప్‌ ‌వెనుక ఉన్న శక్తులెవరో మనం నిగ్గుతేల్చాలని, కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని..ఈ అంశంపై చర్చకు వెనుకాడుతోందని దుయ్యబట్టారు. అదానీపై ఎలాంటి చర్చలు జరగకుండా ప్రధాని మోదీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని విపక్షాలు నిరసనలకు దిగడంతో సోమవారం లోక్‌సభ వాయిదా పడింది. సభ తొలుత ప్రారంభం కాగానే, కాంగ్రెస్‌ ‌సహా విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి అదానీ సర్కార్‌ ‌షేమ్‌..‌షేమ్‌ అం‌టూ నినాదాలతో హోరెత్తించారు. అదానీ గ్రూప్‌ ‌షేర్ల పతనం, కార్పొరేట్‌ ‌దిగ్గజం వ్యాపార పద్ధతులపై విచారణ జరిపించాలని సభ్యులు డిమాండ్‌ ‌చేశారు. అదానీ గ్రూప్‌ అ‌క్రమాలపై హిండెన్‌బర్గ్ ‌రీసెర్చి నివేదికతో గ్రూపు కంపెనీల షేర్లు గత కొన్ని సెషన్స్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. వరుస పతనాలతో అదానీ గ్రూపు కంపెనీలు ఏకంగా రూ. 8.5 లక్షల కోట్ల మార్కెట్‌ ‌క్యాపిటలైజేషన్‌ను కోల్పోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *