అటవీ ప్రాంతాల్లో మైనింగ్‌ అనుమతి

  • గందరగోళంమధ్యే కీలక బిల్లులకు ఆమోదం
  • ప్రబుత్వ తీరుపై సీతారాం ఏచూరి ఆందోళన

న్యూ దిల్ల్లీ,ఆగస్ట్7: ‌గందరగోళం మధ్య పార్లమెంట్‌లో కీలక బిల్లులను ఆమోదించడం సరికాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. చర్చ లేకుండానే బిల్లుల ఆమోదం వల్ల ఏం జరగుఉతుందో ప్రజలకు తెలియకుండా పోయిందని అన్నారు. మణిపూర్‌ అం‌శంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  జవాబుదారీ వహించకపోవడమే పార్లమెంట్‌ అం‌తరాయాలకు కారణమన్నారు. భారీ స్థాయిలో అడవి నిర్మూలించడం, అటవీ ప్రాంతాల్లో ప్రైవేట్‌ ‌మైనింగ్‌కు అనుమతి ఇస్తూ తీసుకొచ్చిన అటవీ సంరక్షణ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించుకున్నారని, దీనికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో భారీ పోరాటాలు జరుగుతాయని చెప్పారు. అటవీ నిర్మూలన వాతావరణ మార్పులపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని, గతంలో ఎన్నడూ లేనంతంగా అకాల వరదలు, వర్షాలు, భూ కంపం, కొండచరియలు విరిగిపడటం, తీవ్రమైన వేడి వంటి వాతావరణ ప్రభావ చర్యలతో ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నా రని తెలిపారు.

ప్రభుత్వ నియంత్రణంలో ఉండే ఖనిజాలు మరీ ముఖ్యంగా లిథియం మైనింగ్‌ను ప్రైవేటీకరించే బిల్లును ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించడం దారుణమన్నారు.. భవిష్యత్తులో గ్రీన్‌ ఎనర్జీకి అవసరమైన బ్యాటరీ ఉత్పత్తిలో కీలకమై లిథియంను కార్పొరేట్‌, ‌బహుళ జాతి కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతుందని, ఇది దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. ఇలాంటి బిల్లులను ఆమోదించి, దేశ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్లకు అనుమతి ఇస్తున్నారని విమర్శించారు.హర్యానా బిజెపి ప్రభుత్వం అల్లర్ల అణచివేత పేరుతో మైనార్టీలను హింసించడం సరికాదన్నారు. వివక్షాపూరిత అరెస్టులు, బుల్డోజర్‌ ‌రాజకీయలను కేంద్ర కమిటీ ఖండించిందని అన్నారు. చాలా మంది వద్ద ఆస్తి పత్రాలు ఉన్నప్పటీకి, కూల్చివేతకు వ్యతిరేకంగా స్టే ఆర్డర్‌ ‌తెచ్చుకున్నప్పటికీ కూల్చివేతలు యథాతధంగా కొనసాగుతున్నాయని విమర్శించారు.

బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మతోన్మాద ఘర్షణలను రేపుతోందని ధ్వజమెత్తారు. సాధారణ పరిస్థితులు పునరుద్ధరించి, శాంతిని స్థాపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, కానీ మైనార్టీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని, మతోన్మాద ధ్రువీకరణకు అవకాశం కల్పిస్తుందని విమర్శించారు. ఓటు బ్యాంక్‌ ‌రాజకీయాల కోసం శాంతి భద్రతలను, మత సామరస్యతకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని, మతోన్మాద ఘర్షణలకు పాల్పడిన వారిని శిక్షించాలని అన్నారు. తప్పు ఎవరు చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని, అంతేతప్ప ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని బుల్డోజర్‌ ‌రాజకీయాలు చేయడాన్ని లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంలో అంగీకరించదగినది కాదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *