అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన

వరంగల్,ప్రజాతంత్ర,మార్చి18:అన్నదాతలను ప్రకృతి పగబట్టింది. వాతావరణంలో ఏర్పడిన మార్పులు రైతులను కలవరపెడుతున్నాయి. చేతికందిన పంట వర్షార్పణం అయిపోతుండటంతో రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. మిర్చి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అసలే ఈ ఏడాది మిర్చికి సరైన ధర లేక తలలు పట్టుకుంటున్న రైతులకు ఇప్పుడు వాతావరణ ప్రతికూల పరిస్థితులు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. చేతికి అందిన వరి, మిర్చి పంటను కాపాడుకోవడం కోసం పడరానిపాట్లు పడుతున్నారు రైతన్నలు. కలాల్లో అరబోసిన మిర్చి పంటను పాలిథిన్ కవర్లతో కప్పి వర్షంలో తడవకుండా కాపాడు కుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుండి వాతావరణంలో మార్పులు సంభవించాయి. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికి అందిన పంట పూర్తిగా వర్షాలపాలైపోతుందని దిగులుతో తలలు పట్టుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *