హిమాయత్నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : అంబేద్కర్ వాదులను అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మెజారిటీ దళిత బహుజన ఓటర్ సమాజంపై ఉందని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. డిబిపి తరుపున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యుర్థులు అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం హిమాయత్నగర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఇప్పటి వరకూ 75 స్థానాల వరకూ జాబితా రూపొందించమన్నారు. నిమ్న జాతులకు సామాజిక న్యాయం, రక్షణ, ఆత్మగౌరవం దక్కి, రాజ్యాంగం అమలు జరగాలంటే దోపిడీ కులాల పార్టీలను ఓడించాలన్నారు. మనువాద, దోపిడీ దొంగల, క్రిమినల్, మాఫియా పార్టీలను రానున్న ఎన్నికల్లో రాజకీయంగా ఓడించకపోతే, అణగారిన కులాలకు భవిష్యత్ ఉండదని, బానిసత్వం తప్పదన్నారు. ఈ సందర్బంగా ఎన్నికల నూతన కమిటీని ఏర్పాటు చేసారు. కమిటీ చైర్మన్ గా డాక్టర్ విఎల్ రాజు, డిప్యూటీ చైర్మన్ గా జెఎన్ రావు, కో-ఆర్డినేటర్స్ గా దేవునూరి శ్రీనివాస్, బీరం సతీష్ కుమార్, సభ్యులుగా గంధం శంకర్, పి.సాంబయ్య వడ్డెర, చిప్పరి కరుణాకర్, ఎండి హుస్సేన్, నక్కా రాజేందర్ రావు, మద్దెల ప్రవీణ్ కుమార్ తదితర నాయకులుతో ఏర్పాటు చేసారు.


