- అభివృద్ధికి సహకరించని మోదీ ప్రభుత్వం
- ఫార్మాసిటీపై కోర్టులో ముగిసిన విచారణలు
- తీర్పు అనుకూలంగా వొస్తుందన్న ఆశాభావం
- మంత్రి కెటిఆర్ వెల్లడి
బెలగావి సమస్య తీర్చలేని మోదీ…యుద్ధాన్ని ఆపారంటే నమ్మాలా : నడ్డా వ్యాఖ్యలపై కెసిఆర్ దెప్పిపొడుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందలేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం ఫార్మా, లైఫ్ సెన్సెన్ రంగంలో ప్రపంచానికి అత్యంత కీలక ప్రాంతంగా ఆవిర్భవించిందని, పరిశ్రమ ప్రయోజనాలు, పారిశ్రామిక అభివృద్ధి కన్నా కేవలం రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. ఇక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్న హావి•లను ఇచ్చుకుంటూ వెళ్తుందని, ఎలాంటి అనుకూల పరిస్థితులు లేని ప్రాంతాల్లో డిఫెన్స్ కారిడార్లను, బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయడంతో కేంద్రం దేశ అభివృద్ధిని పణంగా పెడుతుందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకున్న బల్క్ డ్రగ్ పార్క్ను ఇవ్వకున్నా, హైదరాబాద్ ఫార్మాసిటీకి సహాయం చేయకున్నా, ఐటీఐఆర్ రద్దు చేసినా ఆయా రంగాల్లో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. సరైన నాయకత్వం చిత్తశుద్ధి ఉంటే ఎన్ని అడ్డంకులనైనా దాటుకొని అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని తెలంగాణ నిరూపించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్మాసిటీ విషయంలో కోర్టుల్లో ఉన్న కేసులపై విచారణ ముగిసిందని, కోర్టు రిజర్వ్ చేసిన తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచంలోనే అతి కీలకమైన కేంద్రంగా మారిందని, ఏటా రూ.900కోట్ల టీకాలు తయారు చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
త్వరలోనే ఈ సంఖ్య రూ.1400 కోట్లకు చేరుతుందని, టీకాలన్నింటిలో తెలంగాణ వాటా 50 శాతానికి చేరుతుందని తెలిపిన కేటీఆర్..అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదిత ఫార్మా కంపెనీలు అత్యధికంగా 214 ఉండడం, సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కు, త్వరలో ప్రారంభం కానున్న ఫార్మాసిటీ వంటివి హైదరాబాద్ను జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఎంఆర్ఎన్ఏ టీకా కేంద్రం కూడా త్వరలో హైదరాబాద్లోనే ఏర్పాటు, రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తూండటం కూడా జీవశాస్త్ర రంగానికి, ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
బెలగావి సమస్య తీర్చలేని మోదీ…యుద్ధాన్ని ఆపారంటే నమ్మాలా : నడ్డా వ్యాఖ్యలపై కెసిఆర్ దెప్పిపొడుపు
ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు గొప్పల కోసం చెప్పుకుంటున్న బడాయి మాటలంటూ నిలదీశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై వాస్తవాలను బయటపెట్టారు. బిజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మహరాష్ట్ర మధ్య నెలకొన్న బెలగావి సరిహద్దు సమస్యను ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోదీ పరిష్కరించలేకపోయాడని కేటీఆర్ తెలిపారు.
కానీ రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని మాత్రం ఆపారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపారనేది అవాస్తవమని వాళ్ల నేతృత్వంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖనే వెల్లడించిందని గుర్తు చేశారు. కర్ణాటకలోని ఉడిపిలో మోదీని ప్రశంసిస్తూ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏఎన్ఐలో ప్రచురితమైన ఓ కథనాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. ఔర్ కిత్నా ఫేకో గె సర్ అంటూ సెటైర్ వేశారు.



