- రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది
- అనుముల మండల కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్
నల్లగొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వొచ్చిందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే బాగుపడిందని…ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ అధికారంలోకి వొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ దొంగ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. హాలియా లక్ష్మీ నరసింహ గార్డెన్లో అనుముల మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి పాల్గొన్నారు. తాను ఎంపీగా ఉండి కూడా అధికారుల వల్ల ఇబ్బందులకు గురైనట్లు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. ఏ అధికారి ఇబ్బందులకు గురి చేసినా తనకు చెప్పాలని..24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు. నల్గొండ ఎంపీగా పార్లమెంట్లో నియోజకవర్గ ప్రజల గొంతు వినిపించినట్లు తెలిపారు. టిఆర్ఎస్ ఇచ్చిన రైతు రుణమాఫీ హావి ఏమైందన్నారు. 4ఏళ్ళు కావస్తున్నా ఎందుకు చేయలేదని నిలదీశారు. ఏ దేశంలో లేని స్వేచ్ఛ మన దేశంలో ఉందన్న ఆయన…ప్రపంచ అగ్ర దేశాల్లో భారత దేశం 5వ స్థానంలో, సైన్యంలో 4వ స్థానంలో ఉందన్నారు.
మహాత్మా గాంధీకి, జవహర్ లాల్ నెహ్రులకు మనం వారసులమన్నారు. సత్యాగ్రహ మార్గం ద్వారా స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని..138 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పార్టీ కష్టాల్లో లేదన్నారు. సీనియర్ నాయకులు జానారెడ్డి ఏది చేపట్టినా…ఆయన అడుగుజాడల్లో నడుస్తానని..వారికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర ముగింపు రోజున హాత్ సే హాత్ కలపండి అనే నినాదంతో ముందుకు పోదామని కార్యకర్తలకు ఉత్తమ్ సూచించారు.



