సంక్షేమం భిక్ష కాదు…హక్కు..

చెప్పింది కొండంత..చేసింది రవ్వంత

ఆధునిక రాజ్యాలు అభివృద్ధి లేదా సంక్షేమం భావనను 20 వ శతాబ్దం నుంచి తమ బాధ్యత గా నెరవేరుస్తున్నాయి.పరిపాలనా ఎవరికోసం? ఎందుకోసం అనే భావాన్ని ఒక నూతన, సామాజిక, ఆర్థిక, రాజకీయ నిర్మాణాల కోసం ప్రాతిపదిక అయినాయి.పీడితులు సుదీర్ఘ కాలం చేసిన పోరాటాలు,ఒత్తిడుల వలన కొన్ని విలువలు ఏర్పడి పాలకులకు మార్గదర్శకత్వం ఇచ్చినాయి.భారత రాజ్యాంగం కూడా 38(2) ద్వారా పాలకుల విధానాలు ఏ ధృక్పధం నుంచి వెలువడాలో నిర్దేశించింది. ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం ఒక మౌఖిక రాజ్యాంగంగా పాలకుల ముందు ఉంది. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయిన రైతులు, నిరుద్యోగులు, కార్మికులు, మహిళలకు, వెనుకబడిన, దళిత, ఆదివాసీల, గిరిజన, మైనారిటీ, ట్రాన్స్ ‌జెండర్‌ ‌లాంటి సకల జనం తెలంగాణ కోసం ఎందుకు పోరాడారో అలాగే తెలంగాణ లో స్వరాష్ట్రం లో తమ కనీస జీవితాలు ఏలా ఉండాలో వ్యక్తికరించినాయి.ఇటీవల కాలంలో  అన్ని పాలక వర్గాలు సంక్షేమ భావన నుంచి వైదొలిగి పరిపాలనను స్థిర పరిచినాయి.ప్రజల ఒత్తిడిని చల్లబరిచింది. ప్రజా ఆకర్ష  పథకాలుగా రూపొందించిన వాటిని సంక్షేమ పధకాలుగా దబాయిస్తున్నారు.ఐనప్పటి ఈ అర కొర పథకాలను కూడా అమలుపరచనిదిగా ఉంది.ఈ తొమ్మిదేళ్ళ కాలం దీనిని ఋజువు చేస్తుంది.

గౌరవాని కి నోచుకోని అమరుల కుటుంబాలు
1200 మంది అమరవీరులు తెలంగాణ కోసం త్యాగం చేస్తే కొద్ది మందికి మాత్రమే ఆర్థిక సహయం అందజేసి చేతులు దులుపుకున్నారు.అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హమీ ఇచ్చి ఏదో కొద్దిమందికి ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌కాంట్రాక్టు ఉద్యోగాలతో సరిపెట్టారు.గృహ వసతి కల్పించలే.సాగు యోగ్యమైన వ్యవసాయ భూమి ఇవ్వలే.రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్ల కు అమరుల స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అది కూడా ఒక వినోద కేంద్రంగానే ఉంటుంది తప్ప అమరులకు నిండిన హృదయంతో నివాళి అర్పించేదిగా లేకపోవడం దురదృష్టకరం.ఆవిర్భావం సందర్భంగా అమరుల కుటుంభాలు గౌరవాన్ని కి కూడా నోచుకోవడం లేదు.

దళితులను దగా చేస్తున్నారు
ఎస్సీ సంక్షేమ శాఖకు 2023-24 బడ్జెట్లో 20 వేయిల 703 కోట్ల రూపాయలు ఘనంగా కేటాయించారు ఇందులో 17,700 కోట్లు దళిత బందుకు కేటాయించగా,1811 కోట్లు మాత్రమే దళిత సంక్షేమానికి,1195 కోట్లు ఎస్సీ గురుకులాలకు కేటాయించడం జరిగింది. 2018 నుంచి 2023 వరకు 19 వేయిల?904 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగినారు. దళితుల డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల కోసం 2018-19లో 1827 కోట్ల రూపాయలు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం అత్యంత దారుణం. ఈ ఎన్నికల సంవత్సరంలో డబ్బులు బెడ్‌ ‌రూమ్‌ ‌కోసం 1950 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ నేటికి ఒక్క రూపాయి నిధులను కూడా విడుదల చేయలేదు. దళితుల సంక్షేమానికి కేటాయించిన దాంట్లో 45.8% ఖర్చు చేయలేదని కాగ్‌ ‌నివేదిక గతంలో పేర్కొన్నది. 2021-22 సంవత్సరంలో 2 వేయిల 160 కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. దళితులకు విద్యకు కేటాయించిన దాంట్లో 42% ఖర్చు చేయలేదు. దళిత యాజమాన్య పరిశ్రమలకు 627 కోట్లు కేటాయించి 315 కోట్లు నిదులు విడుదల చేయలేదని విషయం  వాస్తవం. ఇదిలా ఉండగా ఎస్సీ సబ్‌ ‌ప్లాన్‌ ‌నిధులు కూడా దారి మల్లినాయి.
కొద్ది మంది దళితులకు దళిత బంధు ఇచ్చి అంధులో పర్సంటేజీల లెక్క కమీషన్‌ ‌లు తీసుకొని ఇదే తెలంగాణ లో దళితులందరి అభివృద్ధి అనడం ఎంతవరకు సమంజసం.?50 వేయిల కోట్లతో ఎస్సీల ను అభివృద్ధి చేస్తామన్నారు.ఎక్కడ జరిగిందో శ్వేతపత్రం విడుదల చేయాలి కధా.!ఎస్సీలకు కేటాయించిన నిధులను ఎస్సీలకే ఖర్చు చేస్తామన్నారు.! పక్కదోవ పట్టింది వాస్తవం కాదా.!ఎస్సీ  సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టం నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా.! భూమి లేని ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడు ఎకరాల సాగుకు యోగ్యమయ్యే భూమి ఏ మేరకు ఇచ్చారు.?
ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి కోటి రూపాయల ఆర్థిక సహకారం అందించే పారిశ్రామిక విధానం ఎంతవరకు వచ్చింది..?విదేశాలలో విద్యను అభ్యసించడానికి వెళ్లిన ఎస్సీలకు ఎంతమందికి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందించారో ఆ లిస్టును విడుదల చేస్తారా..!
మండల స్థాయిలో ఏర్పాటు చేస్తామన్న అంబేద్కర్‌ ‌వికాస కేంద్రాలు ఎటు పోయినవి.? కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులలో ఒకరికి ఉద్యోగ ఇస్తామన్నా సంగతి ఎటు పోయింది.? ఇవన్ని దళితులను మోసం చేసిన విధానాలు కావా.!

అణగదొక్కబడ్డ ఆదివాసి గిరిజన సంక్షేమం
ఆదివాసి గిరిజనులకు అట్టాసంగా గిరిజన బందును ప్రకటించిన ముఖ్యమంత్రి 2023 24 బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.2016 నుంచి 2021 వరకు గిరిజన నిధులలో 46% వరకు ఖర్చు చేయలేదు.ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌కొరకు 3025 కోట్లు కేటాయించి మూడు కోట్లకు తక్కువగానే ఖర్చు చేసింది.ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌నిధులని దారుణంగా దారి మళ్ళించింది.స్మార్ట్ ‌సిటీస్‌ ‌కోసం 127 కోట్లు,విమానాల రన్వే కోసం 18 కోట్లు ఖర్చు చేసింది.హైదరాబాదు రోడ్ల కోసం 113 కోట్లు,మెట్రో పొడగింపు కోసం 451/2కోట్లు,మున్సిపాలిటీల కోసం 830 కోట్లు దారి మళ్ళించింది.హైదరాబాద్‌ ఆ‌గ్రో మేరేషన్‌ ‌కోసం 1162 కోట్లు దారి మళ్ళించింది.2019-20 లో గిరిజనుల డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌కోసం 10 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.
తండాలను గ్రామ పంచాయితీ లుగా ప్రకటించినప్పటికీ ,ఎస్టీలకు ఇస్తానన్న 12 %  రిజర్వేషన్లు 10% తగ్గించి విద్యారంగంలో రిజర్వేషన్‌ ‌మినహయిస్తే తండాలు అభివృద్ధి కి నోచుకోలేదు.షెడ్యూల్‌ ‌తెగల అభివృద్ధికి ట్రైబల్‌ ‌సబ్‌ ‌ప్లాన్‌ ‌ప్రత్యేక విభాగం అమలుకు నోచుకోలేదు.1/70 చట్టం చిత్తశుద్ధితో అమలు చేయమని కోరుతున్న ఆదివాసీల ను అణగదొక్కుతున్నారు.భూమి లేని ఎస్టీలకు మూడెకరాల వ్యవసాయ భూమి ఇవ్వలే.కోయ గోండు భాషల లిపి కి ప్రాచుర్యం దక్కలే.! మూడు బీముల విషయంలో ఆదివాసి గిరిజనులు రక్తం చిందించాల్సి వచ్చింది.జిల్లాలలో ఆదివాసి గిరిజన భవనాల నిర్మాణాలు చేపట్టలే.!తండాలు గ్రామ పంచాయితీ లై ఉత్సవ విగ్రహల మాదిరిగా ఉన్నాయే తప్ప వారి జీవితాలలో ఏలాంటి మార్పు రాలేదు.తండాలో ‘అభివృద్ధి బోర్డు’ లు ఏర్పాటు చేయకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు.
వెనుకబడిన వర్గాలకు అన్యాయం
తెలంగాణ సమాజం లో సగానికి పైబడి ఉన్న బి.సిలకు అసెంబ్లీలో సగ బాగం సీట్లు ఇవ్వకుండా,చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ ‌కోసం కేంద్రం పై ఒత్తిడి తెస్తామన్నారు. సరే ఆ వైపుగా మీరు చేసిన ఉద్యమాలు ఏవి.? రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు వారి జనాభా ధామాషా ప్రకారం ప్రజాప్రతినిధులుగా వారికి అవకాశం కల్పించకుండా,ఎదుటివారిని ఏలా నిలదీస్తారు.? మాటలు తప్ప చట్టసభలలో బి.సి రిజర్వేషన్ల పై చిత్తశుద్ధి ఏది.? 2018-19 సంవత్సరంలో బీసీ సంక్షేమం కోసం 5960 కోట్లు కేటాయిస్తే 63% ఖర్చు చేయలేదు. 54% ఉన్న బీసీ జనాభా కు 2 లక్షల 90 వేల కోట్లు బడ్జెట్లో ఐదు శాతం కూడా కేటాయించలేదు.గత ఐదేళ్ల కాలంలో 17611 కోట్లు మాత్రమే ఖర్చు చేసినారు.2020-21 లో 299 కోట్ల రూపాయలు ఫ్రీ మెట్రిక్‌ ‌స్కాలర్షిప్‌ ‌కోసం కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.ఇదే స్కాలర్షిప్‌ ‌కోసం 2022లో 254 కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు.ఎంబీసీల కోసం 500 కోట్లు కేటాయించినప్పటికీ నిధులు విడుదల చేయలేదు. 2018-19 లో 75% ఎన్బిసిల కేటాయించిన నిధులు ఖర్చు చేయబడలేదు. 2020-2021 లోను మరో ఆర్థిక సంవత్సరమేనా 2021-22 లోను ఎంబీసీల 100% నిధులు ఖర్చు చేయబడలేదు.రజక కో-ఆపరేటివ్‌ ‌సంస్థ సంస్థకు 2018 19లో కేటాయించిన నిధులలో 73 శాతం నిధులు విడుదల చేయలేదు. నాయి బ్రాహ్మణ కో-ఆపరేటివ్‌ ‌సొసైటీ కి 2018 19 లో 91% నిధులు విడుదల చేయలేదు. కానీ ఈ ఎన్నికల సందర్భంలో ఒక లక్ష రూపాయలు బీసీ వృత్తిదారుల పథకం కోసం పరిగెత్తిస్తున్నారు.
బిసి కార్పొరేషన్‌ ‌కు ప్రతి ఏటా 1000 కోట్లు నిధులు విడుదల చేస్తామన్నారు.! ఏండ్ల తరబడి చెప్పులు అరిగేలా కార్పొరేషన్‌ ‌కార్యాలయాల చుట్టూ  యువత తిరుగుతున్నా నిధులు కేటాయింపు లలో ఉన్నా, ఆచరణ లో విడుదల చేయని దుస్థితి.బీసీల సమగ్రాభివృద్ధి కోసం 25 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తామన్నారు.!చేనేత కార్మికుల కోసం భద్రతా నిధిని ఏర్పాటు చేస్తామన్నారు.! 722 కోట్లు చేనేతకు కేటాయించినప్పటికీ 40% నిధులు ఖర్చు చేయలేదు. 2018-19 లో 36% 2020-21 లో 61% 2021-22లో 81% కేటాయించబడిన నిధులలో ఖర్చు చేయబడలేదు. బతుకమ్మ చీరల కోసం 1700 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ ఆ నిధులను బయట కాంట్రాక్టర్లకు తరలి వెళ్ళిపోయినాయి.సిరిసిల్ల టెక్స్టైల్‌ ‌పార్కు పనిచేయలేని పరిస్థితి ఏర్పడ్డది.పవర్లూమ్‌ ‌కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ చేస్తామన్నారు.ఏవి కూడా అమలుకు నోచుకోలేదు.గ్రామాలలో చెరువులను అభివృద్ధి చేసి ఆ చెరువుల్లో చేపలు పోసుకొని పట్టుకునే హక్కు మత్స్యకారులకు కల్పిస్తామన్నారు.కాని మిషన్‌ ‌కాకతీయ పేరుతో అక్కడక్కడ గోతులు తీసి అటువైపు చూసిన వారే లేరు.
అన్ని గ్రామాల్లో ధోబిఘాట్ల నిర్మాణాన్ని చేపట్టారా..!మంగళ్‌ ‌షాపులకు కావాలిసిన పరికరాల కొనుగోళ్లలో సబ్సిడీ ఇస్తున్నారా.!భాజా భజంత్రీల బృందాలు బ్యాండ్‌ ‌మేళం వారికి వాయిద్యాలు కొనుగోలు లో సబ్సిడీ ఇస్తామన్నారు..!ఎక్కడ ఇస్తున్నారో చేప్పగలరా.!సంచార జాతుల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఏ మేరకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు..? కుల వృత్తులకు అందిస్తానన్న చేయూత ఏమైంది.?ఎన్నికలొచ్చినప్పుడు కులాల వారి గా విభజించి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారే గాని అధికారంలోకి వచ్చిన అనంతరం వెనక్కి నెట్టి వేస్తున్నారు.
మహిళల సంక్షేమం పై పట్టింపు లేదు
బాలింతలకు కేసీఆర్‌ ‌కిట్టు,వితంతవులకు ఇచ్చే పెన్షన్‌ ‌మినహయిస్తే ఏ ఒక్క హమీ కూడా నేరవేర్చిన దాఖలాలు లేవు.44 లక్షల 82 వేయిల పెన్షన్ల లలో దాదాపు 14 లక్షల మంది వితంతు పెన్షన్‌ ‌దారులు ఉండటం ఈ రాష్ట్రంలో ని అసహజ.మరణాలకు సూచిక కాదా.! 36 వేయిల కోట్ల రూపాయలు మధ్యం ద్వారా సేకరించుకునేందుకు ప్రభుత్వం చేసిన వితంతవులు కావడానికి కారణం కాదా.!చట్టసభలలో మహిళలకు 33.3% రిజర్వేషన్లు కోసం ఉద్యమాలు చేస్తామన్నారు..? మహిళా బ్యాంకులను ఏర్పాటు చేస్తామన్నారు.!
మహిళా సంక్షేమ బోర్డును ఏర్పాటు హమీ ఇచ్చారు.!
జిల్లా కేంద్రాలలో మహిళా పారిశ్రామిక కేంద్రాలను ఎక్కడ నెలకొల్పిన దాఖలాలు లేవు.పేద కుటుంబంలో ఆడపిల్ల పుట్టిన నెలలోపే పదివేల రూపాయలు డిపాజిట్‌ ‌చేసి 18 ఏళ్ళు వచ్చే నాటికి ఒక లక్ష రూపాయలు అమ్మాయికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు..!ఆ పథకం జాడకే లేదు.మహిళా దినోత్సవం రోజున సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ పేరున వివిధ కళలలో నైపుణ్యాలు ప్రదర్శించిన మహిళలకు పురస్కారాలు అందజేస్తూ ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహం ఇస్తామన్నారు అది లేదు.? మహిళల భద్రతా చట్టాలు అత్యంత కఠినంగా అమలు చేస్తామన్నారు.కానీ తెలంగాణ మహిళా కమిషన్‌ ‌మాత్రం అత్యాచారలకు గురైన  మహిళలను పరామర్శించే సోయి కూడా లేకుండా పోయింది.జిల్లా కేంద్రాల్లో మహిళా పోలీస్టేషన్‌ ‌లు పర్వాలేదు కాని నియోజకవర్గస్థాయిలో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేస్తానన్న హమీ ఆచరణలో నోచుకోలేదు. ఇచ్చిన హామీలు నెరవేరకపోగా రాష్ట్రంలో మహిళలపై నిరంతరం వేదింపులుజరుగుతూనే ఉన్నాయి.
మైనారిటీ లకు ఇచ్చిన హమీలు అమలుకాలే.!
మైనార్టీల దుస్థితిని సుధీర్‌ ‌కమిషన్‌ ‌తమ రిపోర్టులో చిత్రీకరించింది.75% మంది మైనార్టీలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ దుర్భర జీవితం గడుపుతు న్నారు.85% పైగా దారిద్రయ్య రేఖకు దిగువన ఉన్నారు. 50% ముస్లింలకు సొంత ఇల్లులు లేవు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించారు గత ఏడు సంవత్సరాలుగా మైనారిటీ కార్పొరేషన్‌ ఇచ్చే సబ్సిడీ రుణాలు బంద్‌ అయినాయి.
తెలంగాణలో మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు ఏమైంది.? వక్ఫ్ ‌బోర్డులకు జ్యుడిషియల్‌ అధికారాలు ఇచ్చారా..! పండుగలప్పుడు మైనార్టీ లకు ఇచ్చే వింధులు తప్ప వారి అభివృద్ధి కి ప్రణాళికలు ఏవి.? ఆచరణ లేదు.
కఠోర కష్టాలలో కార్మిక రంగం
ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు పెంచుతా మన్నారు, ఆర్టీసీ సైరన్‌ ‌మోగనది తెలంగాణ ఉద్యమం లేదు.కాని వచ్చిన రాష్ట్రంలో వారి సంఘాలను ఆగమాగం చేసి విఆర్‌ఎస్‌ ఆఫర్‌ ‌చేస్తున్నారు.సమ్మె కు దిగిన అనేక మంది ఆర్టీసీ కార్మికులను పొట్టన బెట్టుకున్నారు. అసంఘటిత కార్మికుల సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. రవాణా, వ్యాపార,నిర్మాణం వివిధ ఆర్థిక రంగాలలో 10 లక్షల మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అంత పెద్ద హామీని అణువంతైన నెరవేర్చలేదు.!జిల్లాలో ఈఎస్‌ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు.ఇంతవరకు ఆ ఊసే లేదు.
మొత్తం గా క్షీణించిన సంక్షేమం
కొద్దిపాటి పథకాలు మినహయిస్తే శిశు,వికలాంగుల,ఉద్యోగుల,న్యాయవాదుల ఇలా అన్ని రకాల సంక్షేమ రంగాలు బలహీన పడ్డాయి. మూడున్నర లక్షల మంది బాల కార్మికులు తెలంగాణలో ఉన్నారు.బడుగు బలహీన వర్గాలకు గౌరవప్రదమైన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు ఇస్తామని అవి ఈ మధ్యకాలంలో డ్రా తీసి ఆరాకొరగా మాత్రమే ఇచ్చారు.! దేశ చరిత్రలోనే వినూత్నంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన గృహ నిర్మాణ పథకం అమలవుతుందన్నారు. ఎక్కడ అమలవుతుంధో నిరూపించాలి కధా.!యువకులకు కార్పోరేషన్‌ ‌ద్వారా ఋణాలు ఇస్తామని చెప్పి కార్పోరేషన్‌ ‌వ్యవస్థ లను నిద్రబుచ్చింది నిజం కాదా.! ఉధ్యమ చైతన్యం తోటి సంక్షేమాన్ని నిరంతరం ఒత్తిడి ద్వారా అమలు పర్చుకోవాల్సిన బాధ్యత ప్రజల పైననే ఉంటుంది. సామాజిక భద్రత ను అమలుచేయకపోతే ఈ వ్యవస్థ ను సామాన్యులే కుప్పకూల్చే పరిస్థితి ఉంటుంది.మొత్తంగా సంక్షేమం బలపడాల్సింది పోయి బలహీనపడుతూ వస్తుంది.

– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *