తిరుమల, డిసెంబర్ 29 : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో జస్టిస్ చంద్రచూడ్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సంఘాల్ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ కుటుంబ సమేతంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సీజేఐ దంపతులకు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం సీజేఐ కి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్ర చూడ్ దంపతులు ఆలయంలో గోపూజలో పాల్గొన్నారు. అంతకు ముందు తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సీజేఐ దంపతులు దర్శించుకున్నారు. వారి వెంట జిల్లా జడ్జి వీర్రాజు , టీటీడీ సీవీ ఎస్వో నరసింహ కిషోర్ అధికారులు పాల్గొన్నారు.



