- మహిళా దినోత్సవం వేళ మహిళల కోసం మూడు అద్భుత పథకాలు
- మహిళల్లో చైతన్యం రావాలి…సి సెక్షన్ డెలివరీ తగ్గాలి
- ఆరోగ్య మహిళ, న్యూట్రిషన్ కిట్స్, వడ్డీ లేని రుణాల విడుదల
- రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 8 : తల్లి బాగుంటేనే కుటుంబం బాగుంటుందనే ధ్యేయంతో ఈ శ్రీరామనవమి నుండి గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం కరీంనగర్ మార్క్ ఫేడ్ ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా వేడుకల్లో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణలోని 50 శాతం మంది మహిళలు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక ఇబ్బందులతో, ఆరోగ్య సమస్యను భర్తకు చెప్పుకోలేక చిన్న సమస్యను పెద్దగా చేసుకుంటున్నారని, వాటన్నింటినీ దూరం చేసేందుకు సిఎం అద్భుతమైన పథకాలను ముందుకు తీసుకొచ్చారన్నారు. కెసిఆర్ కిట్తో గర్భిణీ స్త్రీలకు విశేషమైన సేవలు అందుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 13 లక్షల మంది లబ్ధిదారులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశామని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వ హాస్పిటళ్లలో నమ్మకం పెరిగి కాన్పులు ప్రభుత్వ 30 శాతం నుండి 63 శాతానికి పెరిగాయన్నారు.
మహిళా ఆరోగ్యం పేరుతో మహిళలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే చికిత్స అందిస్తుందన్నారు. మెరుగైన సేవల కోసం కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో 8 రకాల సమస్యలకు 8 వార్డులను ఏర్పాటు చేశామని, చికిత్స కోసం వొచ్చిన మహిళలు పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. త్వరలోనే కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో ఎమ్మారై స్కానింగ్ మిషన్ అందుబాటులోకి తీసుకు వొస్తామని, సమస్య పెద్దది కాకముందే మహిళలు హాస్పిటల్కి వెళ్లి పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలన్నారు. తల్లి బలంగా ఉంటే బిడ్డ బలంగా ఉంటుందని, బిడ్డ బలంగా ఉంటే… తెలంగాణ బలంగా ఉంటుందని,తెలంగాణ బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందన్నారు. గర్భం దాల్చిన మూడు నుంచి నాలుగు నెలల్లో ఒక కిట్టు,ఆ తర్వాత ఏడో నెలలో మరో కిట్టు,మొత్తం తొమ్మిది నెలల్లో ఒక గర్భిణీకి రెండు న్యూట్రిషన్ కిట్లను అందజేస్తామని తెలిపారు.ఈ న్యూట్రిషన్ కిట్లలో నెయ్యి ప్రోటీన్ ఖర్జూరాలు చిక్కీలు, టానిక్కులు గోళీల తోపాటు బలవర్ధకమైన ఆహార పదార్థాలు ఉంటాయని అన్నారు. ప్రతి సంవత్సరం 6 లక్షల మంది గర్భిణి స్త్రీలకు రెండు న్యూట్రిషన్ కిట్లను అందిస్తామన్నారు.
మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వడ్డీ లేని రుణాలను సీఎం కేసీఆర్ ఈ రోజే విడుదల చేశారన్నారు. మొదటి దశలో 7 వందల 50 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మీ మీ ఖాతాల్లో జమ చేస్తున్నామని, రెండవ దశ రుణాలను 3,4 నెలల తర్వాత అందజేస్తామన్నారు. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం న్యూట్రిషన్ పాలసీ పేరుతో కార్యక్రమాలు చేపడుతుంటే, మరోవైపు బిజెపి ప్రభుత్వం పార్టిషన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం బీఆర్ఎస్ దేనని ఆయన కొనియాడారు. తెలంగాణలో పుట్టిన బిడ్డనుండి కాటికి కాలు చాపే వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం అడుగడుగునా ఆలోచించే యోచన ప్రభుత్వం బిఆర్ఎస్,సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉమదన్ననారు. గత ప్రభుత్వాల హయాంలో తాగునీటి కోసం మహిళలు నీటి యుద్ధాలు చేసిన రోజులుండేవని,కానీ తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో ప్రతి ఇంటికి శుద్ధమైన తాగు నీటిని నల్లా ద్వారా నేరుగా వంటింట్లోకి సరఫరా చేస్తుందని, తాగు, సాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో భూమికి బరువయ్యే వంటలు పండుతున్నాయని, పండిన ప్రతి గింజను మంత్రి గంగుల కమలాకర్ కొనుగోలు చేస్తున్నారన్నారు.
వ్యవసాయం అంటే తంటా అనే పరిస్థితి నుండి వ్యవసాయమే పండుగ అనే పరిస్థితికి వచ్చిందన్నారు. నీరు ఫుల్ కరెంట్ ఫుల్ టోటల్ గా తెలంగాణ పవర్ ఫుల్ అయిందన్నారు.తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలంటూ ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారని,లేకపోతే తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. కరీంనగర్లో ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని ప్రారంభిస్తామని,కరీంనగర్ లో ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉందని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వమని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మొండి చెయ్యి చూపితే 5 వందల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని పట్టు బట్టి సాధించిన ఘనత మంత్రి గంగులకు దక్కుతుందన్నారు.ముహూర్తాల పేరుతో సిజిరియన్ చేపిస్తే అది తల్లికి ఇటు బిడ్డకు నష్టాన్ని చేకూరుస్తుంది అవసరమైతే తప్ప నార్మల్ డెలివరీ ఉత్తమని అన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ…ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం చూడాలని ఆరోగ్య మహిళ అనే అద్భుతమైన పథకం చెపట్టినన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. ఈ పథకాన్ని కరీంనగర్ గడ్డ నుండి ప్రారంభించడం ఆనందంగా ఉందని, ప్రపంచంలోని ఏ దేశంలో కూడా అమలు చేయని గొప్ప పథకం ఇది అన్నారు. ఒక్కరోజు కాదు ప్రతిరోజు మహిళా దినోత్సవం కావాలన్నారు.
మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.యత్ర నార్యంతు పూజ్యంతే… రమంతే తత్ర దేవత… ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో… అక్కడే దేవతలు కొలువై ఉంటారు. ఆడబిడ్డ కన్నీరు పెడితే అరిష్టమని ఆడబిడ్డల సంక్షేమం కోసం గొప్ప గొప్ప పథకాలు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్ అన్నారు. నిరుపేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం కల్యాణ లక్ష్మి పథకం తొలిచూరు కాన్పు కోసం సీఎం కేసీఆర్ కిట్టు లాంటి గొప్ప గొప్ప పథకాలను అమలు చేస్తున్నారు. పక్కనే ఎల్ఎండి ఉన్న తాగునీరు రాని రోజులు ఉండేవి, కానీ ఇప్పుడు ప్రతిరోజు నీటి సరఫరాతో పాటు కోట్లాది రూపాయలతో కరీంనగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మహిళలు ఆనందంగా ఉన్నారు. ఆడబిడ్డలను ఆనందంగా ఉంచాలని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని,గొప్ప గొప్ప పథకాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ కు దీవెనలు ఇవ్వాలన్నారు.కేకును కట్ చేసి సంబురాలు ఉత్సవాల్లో భాగంగా పలు స్వయం సహాయక సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు. 9 వందల 65 స్వశక్త సంఘాలకు17.45 కోట్ల రూపాయలు,8 వేల 4 వందల 69 మందికి 684.75 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు, శ్రీనిధి ద్వారా 4086 మందికి 62 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. మెప్మా ద్వారా16309 కోట్ల 49 లక్షలు, 50 వేల సహాయ బృందాలకు ఐదు కోట్లు శ్రీనిధి ద్వారా లబ్ధిదారులకు పంపిణి చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్వేతా మహంతి, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జవేరియా, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రత్న మాల, డిఆర్డిఏ శ్రీలత, డి సి ఓ శ్రీ మాల, డిఎమ్ఓ పద్మావతి, రిసోర్స్ పర్సన్స్ లకు చీర సారతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్వేతా మహంతి, నగర మేయర్ సునీల్ రావు, శాసనసభ్యులు రసమయి బాలకిషన్,సుంకే రవిశంకర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు అదరపు గరిమగర్వాల్ జిబి శ్యాం ప్రసాద్ లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు చైర్మన్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరి శంకర్, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు స్వయం సహాయక బృందాలు తదితరులు పాల్గొన్నారు.




