శ్రీ‌నివాసమంగాపురంలో వైభవంగా కల్యాణ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు

తిరుపతి, ఫిబ్రవరి 13 : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజున ఉదయం 8 గంటలకు అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగనరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా.. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ముందుకు నడిచారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని.. ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు చెప్తారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు కటాక్షించారు.

తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు సోమవారం ఉదయం శ్రీ సోమస్కందమూర్తి, కామాక్షి అమ్మవారి సమేతంగా భూత వాహనంపై అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. నంతరం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *