- సహాయక చర్యల్లో తీవ్ర నిర్లక్ష్యం
- జిహెచ్ఎంసి ముందు కాంగ్రెస్ ఆందోళన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్లో వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వర్షాలు, వరదలు ఎదుర్కునడంలో ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిచ్చింది. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. గన్పార్కు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్కు చెందిన కాంగ్రెస్ నేతలందరూ జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ధర్నాకు దిగారు. మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్, విజయారెడ్డి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.
ఆఫీసు ముందు బైఠాయించి అధికారుల తీరుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు హైదరాబాద్ను విశ్వనగరంగా తయారు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని, విశ్వనగరం కాదుకదా.. ఇప్పుడు చెత్తనగరంగా తయారు చేశారని వారంతా ప్లకార్డులు ప్రదర్శించారు. నగరాన్ని కాపాడాల్సిన అవసరముందన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యానని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.10వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. నాలాల పూడిక తీయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేత వీహెచ్ గ్రేటర్ కార్యాలయం లిప్ట్ దగ్గరకు వెళ్లి ధర్నా చేశారు. వారందర్నీ పోలీసులు బలవంతంగా తరలించారు.




