- కవిత దీక్షపై బిజెపి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ మండిపాటు
- సిఎం తీరుతోనే రాష్ట్రంలో మహిళలపై వరుస ఘటనలని విమర్శ
- పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా దీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10 : ఎమ్మెల్సీ కవిత దిల్లీలో కాదు..ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. లిక్కర్ దందాతో రాష్ట్ర పరువు తీసారని మరోమారు మండిపడ్డారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మహిళా గోస బీజేపీ భరోసా పేరుతో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…లిక్కర్ కేసు నుండి తప్పించుకునేందుకే కవిత దిల్లీలో దీక్ష చేస్తుందని ఆరోపించారు. సీఎం ఇంటి ముందు కవిత ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మహిళలను అవమానిస్తున్నారని అన్నారు. సీఎం తీరుతోనే రాష్ట్రంలో మహిళలై వరుస ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో 33 శాతం మహిళ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేబినెట్ వి•టింగ్ లో మహళలపై ఎందుకు మాట్లాడలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళా హక్కుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని విమర్శించారు. మద్యం రేట్లు పెంచిందే కవిత కోసమని వ్యాఖ్యానించారు బండి సంజయ్. 40 వేల కోట్ల ఆదాయం లిక్కర్ ద్వారా రాష్ట్రనికి వొస్తుందని చెప్పారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ నెంబర్ 2గా ఉందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళల దాడులపై సర్కార్ పట్టించుకోలేదని అన్నారు. మోదీ సర్కార్లో 8 మంది మహిళలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ పిల్లలకు పురుగులన్నం పెడుతున్నారని ఆరోపించారు. సమస్యలు పక్కదారి పట్టించే క్రమంలోనే దిల్లీ డ్రామాలకు తెరతీసారని అన్నారు. దీక్షలో డికె అరుణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



