చెన్నై, డిసెంబర్ 15 : బైక్పై వెళ్తున్న వ్యక్తి మెడకు లోడ్ లారీ నుంచి వేలాడుతున్న తాడు చుట్టుకుంది. దీంతో అతడు బైక్ పై నుంచి గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శ్రీవైకుంటం పట్టణానికి చెందిన ముత్తు అనే వ్యక్తి తన బైక్పై పనికి వెళ్తున్నాడు. ఉరల్ ప్రాంతం వద్దకు అతడు చేరుకోగా ఊహించని సంఘటన జరిగింది. ఎరువుల లోడ్తో వెళ్తున్న లారీ నుంచి ఒక ఎరువుల బస్తా రోడ్డుపై పడింది. ఆ బస్తాకు చుట్టుకుని లారీ నుంచి వేలాడిన తాడు బైక్పై వెళ్తున్న ముత్తు మెడకు చుట్టుకుంది.
దీంతో అతడు బైక్ పైనుంచి గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అయితే ఆ తాడు అతడి మెడను వీడటంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో ముత్తుకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు లారీ నుంచి వేలాడుతున్న తాడు మెడకు చుట్టుకోవడంతో ముత్తు బైక్ పైనుంచి గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటాన్ని అక్కడ ఉన్న స్థానికులు గమనించారు. వెంటనే స్పందించి కాపాడేందుకు పరుగున అతడి వద్దకు వచ్చారు. కాగా, అక్కడి సీసీటీవీలో రికార్డయిన ఈ వీడియో క్లిప్ సోషల్ డియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్లడంతో ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు.



