- ఆనాటి స్వాతంత్య్ర స్ఫూర్తిని కొనసాగించాలి
- గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 19 : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్లో 15వ రోజు సోమవారం ఉత్సాహంగా కొనసాగింది. ఉదయం దౌసా జిల్లా బాందీకుయ్ పట్టణం కోలోనా కోర్ట్ కాంప్టెక్స్ నుంచి ప్రారంభించారు. యాత్రలో రాహుల్గాంధీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలట్, పిసిసి చీఫ్ గోవింద్ సింగ్ జోటస్రా, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్లో 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దౌసా సికిందరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
13 కిలో మీటర మేర సాగి అల్వర్ రాజ్ఘడ్ పట్టణం సురేన్ థానీ చేరుకుని ఉదయం సెషన్ ముగించుకుంది. కాగా సోమవారం గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా రాహుల్ ఆ రాష్ట్ర ప్రజలకు తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తన సందేశంలో ‘మన స్వాతంత్ర సమరయోధుల ఏ మాత్రం లొంగని అంకిత భావం, మన సైనిక బలగాల శౌర్యం వల్ల 1961లో ఇదే రోజు గోవాకు పోర్చుగీసు పాలన నుండి విముక్తి లభించింది. ఆనాటి ఆ స్వాతంత్య్ర స్ఫూర్తిని అలాగే కొనసాగించాలి, గోవా గొప్ప సంస్కృతిని, వారసత్వాన్ని మనం పరిరక్షించుకోవాలి’ అని పేర్కొన్నారు. యాత్ర సాయంకాలానికి అల్వర్ మాలాఖెడా చేరుకోగా అక్కడ రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే బహిరంగ సభలో మాట్లాడారు.




