- దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి భారత్
- అతిపెద్ద రక్షణరంగ ఎగుమతిదారుగా ముందడుగు
- ఏరో ఇండియా ప్రదర్శన ప్రారంభంలో ప్రధాని మోదీ
బెంగళూరు, ఫిబ్రవరి 13 : రక్షణ విమానరంగంలో భారత్ ఇప్పుడు స్వాలంబన సాధించిందని..దిగుమతుల స్థాయి నుంచి, ఎగుమతుల స్థాయికి చేరుకున్నామని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణరంగ ఎగుమతిదారుగా ఎదిగే దిశగా భారత్ ముందడుగు వేస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. ఏరో ఇండియా ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్వేగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నవ భారత సామర్థ్యాలను చాటి చెప్పేందుకు బెంగళూరు గగనతలం వేదికైంది. ఏరో ఇండియా మన బలాన్ని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది.ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు..మన ఆత్మవిశ్వాసానికి ప్రతీక అన్నారు. ఈ రోజు దాదాపు 100 దేశాలు మన ప్రదర్శనలో పాల్గొంటున్నాయంటే..భారత్పై ఈ ప్రపంచం ఎంత విశ్వాసంగా ఉందో స్పష్టమవుతుందన్నారు. ఇప్పుడు విదేశీ రక్షణ రంగ ఉత్పత్తులకు భారత్ కేవలం మార్కెట్ మాత్రమే కాదు.. ఎన్నో దేశాలకు బలమైన రక్షణ భాగస్వామిగా మారిందని ప్రధాని మోదీ అన్నారు.
ఏరో ఇండియా షో 14వ ఎడిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. యలహంక ఎయిర్ బేస్లో ఐదు రోజుల పాటు జరిగే ఏరో ఇండియా షోను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం బసవరాజ్ బొమ్మై , గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారత రక్షణ దళాల ప్రత్యేక క్యాప్ ధరించి ప్రధాని రావడం విశేషం. ప్రధాన మంత్రి ఎయిర్ షోను ప్రారంభించగా..సారంగ్ హెలికాప్టర్ల వంటి యుద్ధ విమానాలు అకాశంలో కనువిందు చేశాయి. భారతదేశం గర్వించదగిన ఈ రక్షణ, వైమానిక ప్రదర్శనలో 98 దేశాలు పాల్గొంటున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ వెళ్లడించారు. ఏరో ఇండియా షోలో కేవలం ఎయిర్ పవర్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 809 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. అందుకోసం యలహంకలోని ఐఏఎఫ్ స్టేషన్లో 35 వేల చదరపు వి•టర్ల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. మంగళవారం జరుగుతున్న ఈ వేడుకల్లో 32 దేశాల రక్షణ మంత్రులు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి 29 దేశాల వైమానిక దళాధిపతులు హాజరుకానున్నారు. రక్షణ రంగంలోని గ్లోబల్ కంపెనీల సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మొత్తం 73 మంది సీఈవోలు హాజరుకావచ్చు. బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, జనరల్ అటామిక్స్, లైబర్ గ్రూప్, రేథియాన్ టెక్నాలజీస్, సఫ్రాన్, జనరల్ అథారిటీ ఆఫ్ మిలిటరీ ఇండస్ట్రీస్ వంటి గ్లోబల్ కంపెనీలు పాల్గొంటున్నాయి మిశ్రా ధాతు నిగమ్ వంటి భారత రక్షణ రంగ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం, ఈ సంవత్సరం ఏరో ఇండియా షోలో 251 ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇది నెరవేరితే భారత ఆర్థిక వ్యవస్థకు 75 వేల కోట్ల పెట్టుబడులు వొస్తాయి. హెచ్ఏఎల్కు అనేక కాంట్రాక్టులు లభిస్తాయని అంచనా..మరొక నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్టెల్త్ ఫైటర్, అమెరికన్ ఈ- 35 ఫైటర్ జెట్, యలహంక ఎయిర్ ఫోర్స్ బేస్లో ప్రదర్శించబడే అవకాశం ఉంది. ఈ- 35 ఫైటర్ జెట్ రాకపోయినా, ఈ -16 వంటి అమెరికాకు చెందిన మరికొన్ని ముఖ్యమైన యుద్ధ విమానాలు ఏరో ఇండియా షోలో ప్రదర్శన ఇవ్వనున్నాయి. రక్షణ శాఖ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏరో ఇండియాను ఆర్భాటంగా నిర్వహిస్తోంది. కొరోనా కారణంతో 2021లో జరిగిన గత వైమానిక ప్రదర్శనలో సందర్శకులకు అవకాశం కల్పించలేదు.
ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో రిహార్సల్స్కు సైతం భారీగా జనం వచ్చారు. ఈనెల 16, 17 తేదీల్లో ప్రదర్శనను సాధారణ ప్రజలు కూడా సందర్శించవచ్చు. ఐదు రోజులూ సమావేశాలు,విమానాల కొనుగోలు ఒప్పందాలు జరుగనున్నాయి. సందర్శకుల కోసం ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు. నగరం నలుమూలల నంచి యలహంకకు బీఎంటీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ’ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఐదు రోజుల పాటు జరగనుంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. ఈ ఎయిర్షోలో భాగంగా భారత్, విదేశీ రక్షణ కంపెనీల మధ్య రూ.75వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరగనున్నట్లు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ ఎయిర్షోలో భాగంగా భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ పాల్గొన్నారు. స్వయంగా యుద్ధ విమానాన్ని నడిపి ’గురుకుల్’ విన్యాసానికి నాయకత్వం వహించారు. 2019 ఏరో ఇండియాలో రెండు సూర్యకిరణ్ విమానాలు ఆకాశంలో ఢీకొట్టుకుని కూలిపోగా పైలట్లు గాయపడ్డారు. మరుసటిరోజు పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగి వందకు పైగా కార్లు బూడిదగా మారాయి. ఈసారి అటువంటి విపత్తులు సంభవించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.




