ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : ముదిరాజుల రిజర్వేషన్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ముదిరాజ్ చైతన్య వేదిక కార్యవర్గ సభ్యులు శివ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బిసి సాధికారత భవన్ లో ముదిరాజులకు రాజ్యంగ బద్దంగా రావాల్సిన హక్కుల కోసం ‘ఆలోచనపరుల మేధోమధనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా శివ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజులు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగాలలో చట్ట బద్ధంగా రావాల్సిన వాటా కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ముదిరాజులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర మహిళా నాయకురాలు కోట్ల పుష్పాలత ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజులకు విద్య, ఉద్యోగాలలో జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి ముదిరాజులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్, కురుమూర్తి, సీత మహాలక్ష్మి, సురేష్, వెంకటేష్, నరసింహ , కూరగాయల వెంకన్న, రవీందర్, మహేష్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.




