అగర్తల, ఫిబ్రవరి 16 : త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ ముగిసింది. ఉదయం 11 గంటల వరకు 32.06 శాతానికి పైగా వోటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 9 గంటల వరకు 13.69 శాతం వోటింగ్ నమోదైంది . ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల సంఘం తెలిపిన ప్రకారం ఉదయం 11 గంటలకు నమోదైన పోలింగ్… ధలైలో అత్యధికంగా 33.92 శాతం, గోమతిలో 30.57 శాతం, ఖోవైలో 30.88 శాతం, ఉత్తర త్రిపురలో 29.48 శాతం, సెపాహిజాలలో 31.72 శాతం, దక్షిణ త్రిపురలో అత్యధికంగా 33.92 శాతం నమోదైంది. 33.61 శాతం, ఉనకోటి 31.85 శాతం, పశ్చిమ త్రిపుర 33.18 శాతం చొప్పున నమోదయ్యాయి. కాగా, 60 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 259 మంది అభ్యర్థుల భవితవ్యం ఖరారైంది. రాష్ట్రంలో ఈ సంవత్సరం 28.14 లక్షల మంది వోటర్లు నమోదయ్యారు, ఇందులో 14,15,233 మంది పురుషులు, 13,99,289 మంది మహిళలు మరియు 62 మంది థర్డ్ జెండర్కు చెందినవారు.
మొత్తం 3,337 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. 7 మహిళా పోలీస్ స్టేషన్లతో ఎన్నికలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 94,815 మంది వోటర్లు 18-19 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కాగా, 6,21,505 మంది 22-29 మధ్య వయస్సు గలవారు. అత్యధికంగా 40-59 మధ్య వయస్సు గల వోటర్లు 9,81,089 మంది ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల కతీతంగా మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇదిలావుంటే త్రిపుర శాసన సభ ఎన్నికల పోలింగ్ ఓ వైపు జరుగుతుండగానే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తిప్ర మోత చీఫ్ ప్రద్యోత్ మాణిక్య దెబ్బర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి పోటీనిస్తున్న ఏకైక పార్టీ తమదేనని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లభించకపోతే, బీజేపీ ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నామని తెలిపారు.
ఆయన గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. ఎన్నికల అనంతరం పొత్తులు, బేరసారాల గురించి విలేఖర్లు ప్రశ్నించినపుడు ప్రద్యోత్ మాట్లాడుతూ, తమ పార్టీకి ఈ ఎన్నికల్లో 30 కన్నా తక్కువ స్థానాలు లభిస్తే, తన రాజప్రాసాదంలో కొంత భాగాన్ని అమ్మేసి, బీజేపీ ఎమ్మెల్యేల్లో 25 నుంచి 30 మందిని కొనాలని అనుకుంటున్నానని చెప్పారు. డబ్బు డబ్బేనన్నారు. మేము మాత్రమే అమ్మకానికి ఉన్నామని ఎందుకు భావించాలి? మా గురించి మాత్రమే ఎందుకు ప్రశ్నలు లేవనెత్తు తున్నారు? బీజేపీ ఎమ్మెల్యేలను కూడా కొనవచ్చని అన్నారు.




