- 267 కింద చర్చకు సిద్దంగా లేని ప్రభుత్వం
- కేవలం 176 రూల్ కింద చర్చకు మాత్రమే అనుమతి
న్యూ దిల్లీ, జూలై 21 : మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణ, హింసాత్మక పరిస్థితులపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. మణిపూర్లో గిరిజన మహిళలపై అనాగరిక చర్యలు, ఆ రాష్ట్రంలోని పరిస్థితులపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్ చేసింది. ప్రధాని మోదీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మౌనంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు లోక్సభలో నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో కేకే వాయిదా తీర్మానం నోటీసులు అందజేశారు. రాజ్యసభ అన్ని కార్యక్రమాలను వాయిదా వేసి 267 నిబంధన కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని కేకే డిమాండ్ చేశారు. మణిపూర్లో శాంతి నెలకొనడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడాలని ఆకాంక్షించారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న మణిపూర్లో శాంతి నెలకొనాలని.. సాధారణ పరిస్థితులు ఏర్పడాలని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు. మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అంశంపై పార్లమెంట్లో చర్చించాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. సుదీర్ఘ స్థాయిలో చర్చ చేపట్టేందుకు రూల్ 267 కింద వాయిదా తీర్మానం నోటీసులు జారీ చేస్తారు.
అయితే ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం అంగీకరించినా.. కేవలం రూల్ 176 కింద ఆ అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.అంశాన్ని చర్చించుకునే వీలు ఉంటుంది. రూల్ 267 కింద ఎవరైనా ఎంపీ వాయిదా తీర్మానం ఇస్తే, అప్పుడు అన్ని సభా కార్యక్రమాలను రద్దు చేసి కేవలం ఆ అంశాన్ని మాత్రమే డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కానీ దానికి చైర్మెన్ అనుమతి అవసరం. 1990 నుంచి 2016 వరకు రూల్ 267 కింద 11సార్లు సభలో చర్చ చేపట్టారు. 2016లో అప్పటి చైర్మెన్ హమిద్ అన్సారీ.. నోట్ల రద్దు అంశంపై డిబేట్కు అవకాశం కల్పించారు.
అయితే గత ఆరేళ్లు మాజీ చైర్మెన్ వెంకయ్య నాయుడు తన హయంలో రూల్ 267 కింద ఒక్క నోటీసును కూడా ఆమోదించలేదు. ప్రభుత్వాన్ని నిలదీసి, ఏదైనా స్పందనా కోరాలని భావిస్తే, రూల్ 267 ఒక్కటే మార్గం. క్వశ్చన్ అవర్ సమయంలో ఆ రూల్ కింద ఎంపీలు ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్న వేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం స్వల్ప స్థాయి చర్చ చేపట్టాలని చూస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూల్ 176 కింద చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ రూల్ బుక్ ఇప్పుడు కీలకంగా మారింది. రూల్ 176 కింద కేవలం రెండున్నర గంటలు మాత్రమే చర్చ ఉంటుంది. ఈ రూల్ కింద ఎటువంటి తీర్మానం కానీ ఓటింగ్ కానీ ఉండదు.




