భోగి పండుగ

చాంద్రమానం పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి సంబరాలలో మొదటిది బోగి పండగ. ఇది ఇతర పండుగల వలె తిథి ప్రధానమైనది కాదు. ఇది ధనుర్మాసానికి, దక్షిణాయనానికి ఆఖరు రోజు, మకర సంక్రమణానికి పూర్వపు రోజు. రైతులకు పంట పర్యాయాలు ముగిసి ఈపండుగ నాటికి ఇంటికి వచ్చేస్తాయి. వాళ్ళకు వ్యవసాయపు పనులు రద్దీ తగ్గి సుఖంగా కాలక్షేపం చేయడానికి వలసిన విశ్రాంతి లభించే కాలమిది. చేతి కందిన పంటను అనుభవించడానికి తెచ్చుకుని భోగభాగ్యాలు అనుభవానికి రైతులకు వీలు కలిగించే పండుగ ఇది. కనుకనే ‘‘భోగి’’ అని పేరు వచ్చింది. గోదా దేవి తిరుప్పావై రచన పూర్తి చేసిన ముప్పయవ నాడు రంగనాధుడు ప్రత్యక్షమై, ఆమెను వివాహమాడఓతానని, సకల భోగాలు సమకూరుస్తానని చెప్పి, వివాహ మాడగా, వివాహ తంతు పూర్తికాగానే ఆమె స్వామి వారిలో ఐక్యం పొందుతుంది. అందుకే భోగి అని ఈ పర్వదినానికి పేరు.

జన సామాన్యానికి భోగ భాగ్యాలు ఇచ్చే రోజని ప్రతీతి. బోగినాడు మేఘాధిపతిjైున ఇంద్రపూజ చేయడం అనవాయితీ. బోగినాడు బలి చక్రవర్తి అణగిన దినంగా చెపుతారు. సాంప్రదాయాచరణ ప్రకారం ఈనాడు బోగిపీడ నివారణకై తెల్లవారగానే అభ్యంగన స్నానం చేయడం విధాయక కృత్యం. భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగు పండ్లను పిల్లల మీద పోస్తారు. రేగు పండును బదరీఫలం రేగు చెట్టు, రేగు పండ్లు శ్రీ మన్నారాయణ  ప్రతిరూపం. వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం  పిల్లలపై ఉంటుందని, భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, దిష్టి తొలుగు తుందంటారు. తలపై భాగంలో ఉండే బ్రహ్మరంధ్రం పై భోగి పండ్లను పోస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారని విశ్వాసం. అలా చంటి పిల్లలకు తలంటుపోసి, బోగి పళ్ళు పోయడంతో దృష్టి పరిహారం చేస్తారు.

కొత్త బట్టలు కట్టి, కుర్చీలో కూర్చుండచేసి, రేగు పళ్ళు, పైసలు, చెరుకు ముక్కలు, బోడికలు దిగువార బోస్తారు. ధనుర్మాసం నెల రోజులు ఆడపిల్లలు తయారు చేసిన గొబ్బి పిడకలు వేయడం, తెల్లవారగట్ల బోగిమంటలు వేయడం ఆచరించారు. భోగి మంటలలో వాడే దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఆయురారోగ్యాలు వృద్ధి కలుగుతాయని విశ్వాసం. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు.. మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు చేకూరుతాయి. ఆడపిల్లలు తెల్లవారు జామున లేచి పెట్టే గొబ్బిళ్ళు, ఆర్ష కర్మలలో ప్రాముఖ్యం కలిగిన కళాభిజ్ఞత ఉట్టిపడే ముగ్గులు, పళ్ళ నైవేద్యాలు, బాజా భజంత్రీల వాద్యాలు ఎక్కడ చూసినా తెలుగుదనం ఉట్టిపడేట్టు చేసే పండగ ఇది.

  -రామకిష్టయ్య సంగనభట్ల
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *