- అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష
- ఏజెన్సీలో వైద్య సేవలకు సిద్ధం కావాలన్న మంత్రి
- విద్యుత్ శాఖను అప్రమత్తం చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబల కుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో వరుసగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రతమత్తమైంది. జిల్లా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వైద్యసేవలు సూచించింది. మరో వైపు ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సవి•క్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఏజెన్సీ ప్రాంతాలు, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నెలలు నిండిన గర్భిణులను గుర్తించి..వారిని ముందే హాస్పిటల్కి తరలించి వసతి కల్పించాలని సూచించారు. ప్రజల్ని కాపాడేందుకు అవసరమైతే హెలికాప్టర్ను వినియోగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇక భారీ వర్షాలు కురుస్తుండడంతో విద్యుత్ శాఖ అప్రమత్తం అయ్యింది. వర్షాల ప్రభావంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలుగ కుండా చూడాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంధన శాఖా ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్కో/జెన్కో సియండి దేవులపల్లి ప్రభాకర్ రావు, టిఎస్ఎస్పిడిసిఎల్ సియండి రఘుమారెడ్డిలతో ఇప్పటికే ప్రత్యేక సవి•క్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణా రాష్ట్రంలో మెయింటెన్స్ ఆఫ్ సప్లై గురుంచి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతటి భారీ వర్షాలు సంభవించినా సరఫరా నిరంతరం కొనసాగేలా చూడాలని సూచించారు. విద్యుత్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా చూడడంతో పాటు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండేలా ఆదేశించాలని ఆయన చెప్పారు. బ్రేక్ డౌన్ ఆయిన పక్షంలో అత్యవసరంగా రిస్టోర్కు అవసరమైన సిబ్బందిని, మెటీరియల్ను అందుబాటులో ఉంచాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలుగ కుండా అన్ని చర్యలను తక్షణం చేపట్టాలని ఆయన ఆదేశించారు.




