- హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ గుర్తింపు
- 1012 కోట్లతో 11,700 డబుల్ బెడ్ రూంలు : మంత్రి మహేందర్ రెడ్డి
హైదరాబాద్,సెప్టెంబర్2 : సంక్షేమ పథకాల అమలు కోసం సీఎం కేసీఆర్ ఎంతటి భారమైన ముందుకు సాగుతున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. పటాన్ చెరువు నియోజకవర్గం కడ్దనూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ర్యాండమైజేషన్ పద్దతిలో మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్, పటాన్ చెరువు ఎంఎల్ఏలు ప్రకాష్ గౌడ్,గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పటాన్ చెరువు ప్రాంతంలోని కడ్దనూరు ఫేస్ 2 లో రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి చెందిన రాజేంద్ర నగర్, నార్సింగి, బైరాగిగూడ ప్రాంతాలకు చెందిన 500 మంది లబ్దిదారులకు రూ. 46 కోట్ల నిధులతో ఇళ్లు పంపిణీ చేశామన్నారు.
జిహెచ్ఎంసి పరిధిలో రెవెన్యూ శాఖ గుర్తించిన అర్హులైన నిరుపేదల కోసం ఒకేరోజు 8 ప్రాంతాలలో మొత్తం 11,700 మందికి రూ.1012 కోట్లతో లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తున్నామని వివరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీ సీఎం కేసీఆర్ మానస పుత్రికగా పేర్కొంటూ దేశంలో ఎక్కడ లేని విధంగా నిర్మిస్తున్నట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఎంతో పారదర్శకంగా పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను నిర్మించి ఇస్తున్నట్లు మహేందర్ రెడ్డి చెప్పారు. కర్దనూరు 2వ ఫేస్ లో మరో 1620 ఇళ్ల ను రూ. 140.13 కోట్లతో నిర్మించిన ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భారీగా నిధులు అందించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని మహేందర్ రెడ్డి అన్నారు. సామాజిక, వ్యక్తిగత వికాసం కోసం రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు, బీసీ , ఇతర కులాల వృత్తులు ప్రోత్సహించే ఆర్థిక సహాయం దేశానికే తలమానికం అని తెలిపారు.




