- ఎంఐఎం కబంధ హస్తాల్లో ఆ పార్టీలు
- బీసీ జన గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు..
- ఎస్సీ వర్గీకరణకు ప్రధాని హామీ
- సంస్థాగత మార్పులో భాగంగానే బండి సంజయ్ మార్పు
- బీజేపీకి అవకాశం ఇస్తే గుజరాత్, యూపీలా అభివృద్ది
- కాంగ్రెస్లో విభేదాలు ఉన్నాయని ఖర్గేనే ఒప్పుకున్నాడు
- కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు వోట్ల కోసం గాలం
- మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో బిజెపి ఎంపి డాక్టర్ కే.లక్ష్మణ్
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ అంటే బీసీలను అవమానించే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు, బీజేపీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. కులం కాదు గుణం ముఖ్యం అని కేటీఆర్ కూడా బీసీలను అవమానించే విధంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ…బిఆర్ఎస్, కాంగ్రెస్లు తోడు దొంగలని, ఆ పార్టీలు ఎంఐఎం కబంధ హస్తాల్లో ఉన్నాయన్నారు. బిఆర్ఎస్ ఈ రోజు కాకున్నా రేపయినా కాంగ్రెస్తో కలిసి పోతుందన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని అన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలాలని ఆ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఎస్సీ వర్గీకరణ బాధ్యత తాను తీసుకుంటానని ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లాగా అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకున్నా తెలంగాణలో కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. బీసీ జన గణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ కొన్ని సమస్యలు, టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయన్నారు. రెడ్డి, చౌదరిలు కర్ణాటకలో బీసీలు, వైశ్యులు, బ్రాహ్మణులు కొన్ని రాష్ట్రాల్లో బీసీలు, వాళ్ళను బీసీలో చేర్చాలన్నారు.
కర్ణాటకలో బీసీ గణన చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టలేదన్నారు. తమ పార్టీలోనే విభేదాలు ఉన్నాయని మల్లికార్జున్ ఖర్గేనే ఒప్పుకున్నాడని వివరించారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి ఉమ్మడి పౌర చట్టంను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. బీసీల నుండి సీఎం అభ్యర్థులు బిజెపి పార్టీలో చాలా మంది ఉన్నారని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి గ్యాబ్ లేదన్నారు. ఆర్ఎస్ఎస్ సలహాలు సూచనలు మాత్రమే ఇస్తుందన్నారు. తాండూరులో బిజెపి మిత్రపక్షం జన సేన పోటీ చేస్తుందన్నారు. మిత్ర పక్షంలో ఉన్న వారిని బీజేపీ గౌరవిస్తుందన్నారు. సంస్థాగత మార్పులో భాగంగానే బండి సంజయ్ ను మార్చడం జరిగిందన్నారు.
ఇప్పుడు అయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారని అన్నారు. చిదంబరం వ్యాఖ్యలు హత్య చేసిన వాడే నివాళులు అర్పించినట్టు ఉందని ఇద్దేవా చేశారు. నేడు వచ్చి క్షమాపణ చెబితే తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో కర్ణాటక ప్రజలని మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలు ఓట్ల కోసం వేసే గాలం మాత్రమే అని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించామని.. అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో తగ్గిస్తామని హామీ ఇచ్చారు.



