- చాలా రాష్ట్రాల నుంచి త్వరలో పార్టీలోకి చేరికలు
- బతుకమ్మను, మహిళలను బండి సంజయ్ అవహేళన చేస్తున్నారు
- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : ‘భారత్ రాష్ట్ర సమితి’ ప్రకటనతో బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో భారత్ రాష్ట్ర సమితితో కొత్త చరిత్ర సృష్టిస్తామన్న ఆమె.. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని తెలిపారు. మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన కవిత.. బతుకమ్మను, మహిళలను బండి సంజయ్ అవహేళన చేస్తున్నారని ఆరోపించారు. సరైన సమయంలో భాజపాకు బుద్ధి చెబుతామన్నారు. యాగాలు చేయడం కేసీఆర్కు కొత్త కాదన్నారు. ప్రధాని మోదీ.. మమతా బెనర్జీని, బండి సంజయ్ తనను అవహేళన చేశారన్నారు. పశ్చిమ్బెంగాల్ ఎన్నికల్లో భాజపాకు ప్రజలు బుద్ధి చెప్పారని, అదే విధంగా తెలంగాణలోనూ ఆ పార్టీకి బుద్ధి చెప్తారన్నారు.
యాగాలు చేయడం సీఎం కేసీఆర్కు కొత్త కాదని, బిఆర్ఎస్కు దైవశక్తి అవసరం కాబట్టే యాగాలు చేస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో భాజపాకు బిఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాబోతుందని, తాము భాజపా వ్యతిరేక కూటములను ఏకం చేస్తామని, ఇతర రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులను బట్టి వ్యూహాలను ఖరారు చేస్తామని కవిత తెలిపారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా వెళ్లి ఓడిస్తానని, భాజపా రణనీతిలో దర్యాప్తు సంస్థలు భాగమని ప్రజలకు తెలుసునని, ఆ విషయంలో భయపడేది లేదని అన్నారు. భారత్ జాగృతి ద్వారా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామని, రాష్ట్రంలో తెలంగాణ జాగృతి యథావిధిగా కొనసాగుతుందన్నారు.
ఏపీలో ఎన్నికలకు సమయం ఉన్నందున ఇంకా అక్కడ తమ వ్యూహాలు ఆలోచించలేదని, రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ తాను పోటీ చేస్తానని తెలిపారు కవిత భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వెళ్లి ప్రచారం చేసి ఆయన్ను ఓడిస్తానని కవిత వ్యాఖ్యానించారు. సోమవారం పార్లమెంటులో భాష విషయంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందిస్తూ.. నిర్మలా సీతారామన్ వీక్ హిందీ గురించి కాకుండా.. వీక్ రూపి గురించి స్పందిస్తే మంచిదని సూచించారు.




