- అయిదు బోగీలు పూర్తిగా…ఒకటి పాక్షికంగా దగ్ధం
- చైన్ లాగి అప్రమత్తం చేయడంతో తప్పిన ముప్పు…ప్రాణ నష్టం
యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జూలై 7 : ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య హౌరా నుంచి సికింద్రాబాద్ వొస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని రెండు బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా లవి మరో నాలుగు భోగీలకు మంటలు విస్తరించాయి. ఇది గమనించిన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. అదృష్ట వశాత్తు రాత్రి సమయం కాకపోవడం, మరికొద్ది సేపటిలో రైలు గమ్యం స్థానం చేరుకోనుండడంతో దిగడానికి సిద్ధమౌతున్న ప్రయాణీకులు అప్రమత్తమ వడంతో పెద్ద ముప్పు తప్పింది. తమ భోగీలకు మంటలంటుకున్నట్లు గమనించిన కొంత మంది ప్రయాణీకులు అప్రమత్తమై దిగిపోగా మరికొంత మంది ప్రయాణికులను సిబ్బంది రైలులో నుంచి దించివేశారు. దీంతో ప్రయాణీకులు అందరూ సురక్షితంగా బయటపడడంతో ప్రాణనష్టం తప్పింది. చాలా వరకు ప్రయాణీకులు తమ లగేజోలతో సహా దిగిపోయే అవకాశం లభించింది. అయితే మంటలు క్రమంగా మిగతా బోగీలకు కూడా విస్తరించాయి.
దీంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ నుంచి ఘటనా స్థలానికి చేరుకోగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి కొన్ని గంటల సమయం పట్టింది. ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్యలో రైలు సికింద్రాబాద్ వొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఓ వ్యక్తి అప్రమత్తమై చైన్ లాగడంతో ప్రయాణికులంతా హుటాహుటిన రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. మంటల్లో అయిదు బోగీలు పూర్తిగా దగ్ధం కాగా మరొక భోగీ పాక్షికంగా తగులబడిపోయాయి. అయితే ప్రస్తుతం ఆ చైన్ లాగిన వ్యక్తి పరిస్థితి బాగోలేదని తెలుస్తుంది. ఆ తరువాత అతను పడిన ఆందోళనకో ఏమో కానీ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వెంటనే రైల్వే సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం దగ్గరలోని హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తుంది. ఇక చైన్ లాగిన వ్యక్తిది శ్రీకాకుళం జిల్లా పలాస అని సమాచారం.




