- పాఠశాలల బలోపేతం కోసం 9 వేల కోట్లు
- త్వరలో ఉపాధ్యాయుల నియామకం..బదిలీలు చేపడుతాం
- ప్రైవేట్ పాఠశాలలు వొద్దు… ప్రభుత్వ పాఠశాలలే ముద్దు
- స్వరాష్ట్రంలో పట్టణాల నుండి పల్లెలకు వలసలు
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- రంగాపూర్, వంగూర్ గ్రామాల్లో 3.10 కోట్లతో పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన
అచ్చంపేట, జూన్ 6(ప్రజాతంత్ర విలేఖరి) : రాష్ట్రంలో ప్రాథమిక విద్యను పూర్తి స్థాయిలో బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని ఎల్లమ్మ రంగాపూర్, వంగూరు గ్రామాల్లో మన ఊరు మన బడి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ అచ్చంపేట్ శాసనసభ్యులు గువ్వల బాలరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణలో విద్యావిధానాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఎల్లమ్మ రంగాపూర్ ప్రాథమిక, జిల్లా పరిషత్ మరియు వంగూరు జడ్.పి.హెచ్ఎస్ పాఠశాలల మౌలిక వసతుల కోసం 3.10 కోట్లు నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మొత్తం మూడు విడతల్లో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి చర్యలు చేపడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పథకం ప్రవేశ పెట్టిన అది సంపూర్ణం అయ్యేవరకు వదిలిపెట్టరని, అందుకు మన ముందున్న అనేక సంక్షేమ పథకాలే నిదర్శనమన్నారు. గత పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి పరంగా నాశనం చేశారని, పాఠశాలల స్థితిగతులను పట్టించుకోలేదని, విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు.
గతంలో ప్రైవేటు పాఠశాలలు నడిపేవారు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారని విమర్శించారు. నేడు ఆ పరిస్థితులు లేవని, అందుకే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు పంపరాదని, ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని మంత్రి సూచించారు. పాఠశాలల బలోపేతంలో భాగంగానే ఒక పక్క మౌలిక వసతుల ఏర్పాటు, మరోపక్క ఉపాధ్యాయ బదిలీలకు శ్రీకారం, ఉపాధ్యాయుల నియామకం పక్రియను త్వరలో ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య సంపూర్ణంగా అమలయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన యూరప్, అమెరికా లాంటి తదితర దేశాల్లో ప్రైవేటు పాఠశాలలో నూటికో కోటికో ఉంటాయని, ఆ పరిస్థితి అభివృద్ధి చెందుతున్న దేశాలలో రావాల్సి ఉందని, అందుకు తగిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అంకురార్పణ చేశారన్నారు. పట్టణాల నుండి పల్లెలకు వలసలు..రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ లతో పాటు రాష్ట్రానికి తలమానికమైన వ్యవసాయ అభివృద్ధి ఆకాంక్షతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అదే ఆకాంక్షతో రైతును రాజును చేసేలా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన నిదర్శనమన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు ఆరేడు నియోజకవర్గాలలో సాగునీరు సంపూర్ణంగా అందుతుందని, మిగతా ప్రాంతాలకు అలాగే అచ్చంపేట ప్రాంతానికి సంపూర్ణ సాగు నీరు అందేలా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృషి చేస్తున్నారని తెలిపారు. పనుల కోసం పట్టణాలకు వెళ్లిన పల్లె ప్రజలు తిరిగి పట్టణాలను వదిలి గ్రామాలకు చేరుతున్న తీరు అభివృద్ధికి నిదర్శనం అన్నారు.
ప్రజలందరూ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ మూడు విడతలుగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రతి మంత్రి ఒక నిమిషం పాటు అందరితో చప్పట్లు కొట్టించారు. పోలీసులు సైతం తుపాకులు పక్కకుపెట్టి చప్పట్లు కొట్టాలని సూచించారు. అంతకుముందు ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మవిశ్వాసం తోనే రాష్ట్రం ఏర్పడిందని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా ఆ పథకాలు అమలయ్యేలా చేసి తెలంగాణ దిక్సూచి అయిందన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా సీఎం కేసీఆర్ పాఠశాలల బలోపేతంలో భాగంగా విద్యార్థులకు భాష ప్రావీణ్యత పెంచేలా ఆంగ్ల విద్య అమలు చేస్తున్నారని తెలిపారు. వంగూరు మండలంలో ఏడు కోట్ల రూపాయల నిధులతో 14 పాఠశాలలను మొదటి విడతలో ఎంపిక చేసి అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అచ్చంపేట నియోజకవర్గం లోని మొత్తం 34 పాఠశాలల్లో 23 కోట్ల రూపాయలతో మొదటి విడతలో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీపీ రాములు మాట్లాడుతూ…పాఠశాలల అభ్యున్నతికి ప్రభుత్వం అభివృద్ధికి మూలం విద్య అని భావించి చర్యలు చేపడుతుందని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు గ్రామస్తులు సహకారం అందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ..జిల్లాలో ఆంగ్ల విద్య అమలు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ పూర్తి చేశామని, మన ఊరు మన బడి ద్వారా మంజూరైన అభివృద్ధి పనులను గ్రామస్తులు నాణ్యత విషయంలో పర్యవేక్షణ ఉండాలని అని అలాగే విద్యపై ఎస్ఎంసి, గ్రామపంచాయతీ కమిటీల ప్రాధాన్యత విషయంపై గుర్తు చేశారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుచూపుతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ మౌలిక వసతులను కల్పిస్తున్నారని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి కావాల్సిన రోడ్డు, ఆటస్థలం, బ్యాంకు సేవలు అవసరమని అలాగే వెటర్నరీ వైద్య కేంద్రం గురుకుల పాఠశాల 25 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని మంత్రి దృష్టికి సర్పంచ్ ఝాన్సీ తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, ఈఈ పీ ఆర్ దామోదర్ రావు, డి పి ఓ కృష్ణ, ఆర్డీవో రాజేష్ గౌడ్, సర్పంచ్ ఝాన్సీ, ఏంపి పి భీమమ్మ, కో ఆప్షన్ నెంబర్ హమీద్, పాఠశాల హెచ్ఎం భవాని, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




