కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 02 : నిస్వార్థ సేవతో కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతూ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసులను దోచుకున్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నియోజకవర్గలోని అన్ని డివిజన్ లలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం పాలనను ప్రజల వద్దకే తేవడం, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ప్రభుత్వ ఫలాలను అందజేయడంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎంతో కృషి చేశారు. శనివారం కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సబిహా గౌసుద్దిన్ తో కలిసి 25వ రోజు రాజీవ్ గాంధీ నగర్, సబ్దర్ నగర్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేశారు. ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులతో కలిసి సమస్యలను పరిష్కారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ అల్లపూర్ డివిజన్ ను 60 సంవత్సరాలు పాలించిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు డివిజన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. తొమ్మిది సంవత్సరాలలో ప్రతి బస్తీకి రోడ్లు, డ్రైనేజీలో ఇంటింటికి మంచినీటి ఇప్పించడంతో పాటుగా కేసీఆర్ ప్రవేశపెట్టిన 59 జీవో ప్రకారం రెగ్యులరైజేషన్ చేశామని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి విడుతల వారీగా ఇండ్లు అందిస్తామని తెలిపారు. అందులో భాగంగానే సెప్టెంబర్ రెండవ తారీఖున 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూంలు పంపిణీ చేస్తున్నామని మొత్తం 8 విడుతలలో 4400 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూంలు అందజేస్తామని అన్నారు.




