- ఉపాధి, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం
- కెసిఆర్ తీరుపై మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్
నిజామాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : వరదలతో ప్రజలు నానాయాతన పడుతుంటే సిఎం కెసిఆర్ సొంత రాజకీయ ప్రయోజనాలకే పరిమితం అయ్యారని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బరీ అలీ ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మహా రాజకీయాలతో బిజీగా ఉన్నారని అన్నారు. కెసీఆర్ కుటుంబ పాలనకు కొన్ని రోజులు మాత్రమే మిగిలాయని… ప్రజలు ఇంకోసారి బిఆర్ఎస్కు అవకాశం ఇవ్వరని మాజీమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ మూసీనది ఆక్రమణలను ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహి స్తున్నారని ఆరోపించారు. వరదలతో నష్టపోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఈయేడు కూడా భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల ఇళ్లు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏడాది తర్వాత కూడా మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి మార్పులు రాలేదని మండిపడ్డారు. చెరువుల ఆక్రమణ కారణంగానే పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి బాధితులకు అండగా నిలవాలని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని షబ్బీర్ అలీ కోరారు. భారీ వర్షాలతో రాష్ట్రం ఆగమాగమైనా ముఖ్యమంత్రి మాత్రం బయట అడుగుపెట్టకపోవడం విచారకరమని అన్నారు.
ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంటే ముఖ్యమంత్రి సొంత రాజకీయాల కోసం కుట్రలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం రాజకీయ ఆలోచనలపైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు. ఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని అన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు మంచి పనులు చేయాలని సూచించిన షబ్బీర్.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎలాగైనా కేసీఆర్ కుటుంబానికి అవకాశమివ్వరని చురకలంటించారు.కేసీఆర్కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని నిప్పులు చెరిగారు.




