- సర్వేలకు అందని విధంగా లోక్సభ ఫలితాలు
- వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి కేంద్ర పథకాలు
- ముఖ్య నేతలతో సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : జనసేనతో ఇక పొత్తు లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టత ఇచ్చారు. సర్వేలకు అందని విధంగా లోక్సభ ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో పొత్తులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించగా ముఖ్యనేతలు జిల్లా అధ్యక్షులు, ఇంచార్జ్లు, పార్లమెంట్ ప్రబారీలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్కు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు..అన్నది కేవలం ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు.
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చిచెప్పేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్తో సమాన పోరాటాలుంటాయన్నారు. లోక్సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సర్వే సంస్థలకు కూడా అందని విధంగా లోక్సభ ఫలితాలుంటాయన్నారు. శనివారం నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళాలని కేడర్కు సూచించారు. కొత్తగా ఎన్నికైన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేయాలని కిషన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో జనసేనను దూరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించుకోవడంతో ఏపీలో కూడా ఇక బీజేపీతో కలిసే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.




