పార్లమెంటు ఎన్నికలు..బిఆర్‌ఎస్‌కు విషమ పరీక్ష

పోటీకి జంకుతున్న కొందరు .. కారు దిగుతున్న మరికొందరు ప్రముఖులు
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్‌, మార్చి 11 : పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) విషమ పరీక్షను ఎదుర్కునాల్సి వొస్తున్నది. మరో మూడు నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రానుండడంతో అందుకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతుండగా బిఆర్‌ఎస్‌ డీలాపడిపోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమవడమే కాకుండా, దశాబ్ధ కాలం ఇక్కడ అధికారం చెలాయించిన పార్టీ ఈ ఎన్నికల వేళ గడ్డుకాలన్ని ఎదుర్కునాల్సి వొస్తున్నది. 2001లో బిఆర్‌ఎస్‌ (టిఆర్‌ఎస్‌) పార్టీని ప్రారంభం మొదలు 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసేవరకు రాష్ట్రంలో సంభవించిన ఏ ఎన్నికలనైనా తేలిగ్గా తీసుకున్న బిఆర్‌ఎస్‌ పార్టీకి ఈ ఎన్నికలు కఠిన పరీక్షగా మారాయి. తన లక్ష్యాన్ని సాధించుకునే క్రమంలో బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ రాజీనామాలతో ఉప ఎన్నికలను సృష్టించడమేకాదు, ఆ ఎన్నికల్లో తనదే పై చెయ్యి అని నిరూపించుకోవడం ద్వారా ఎన్నికల్లో పోటీ చేయడమంటే తమకు నల్లేరుమీద నడకే అన్నట్లుండే బిఆర్‌ఎస్‌కు ఈనాడు దిక్కుదోచని పరిస్థితి ఏర్పడిరది.
తెలంగాణ అంటే టిఆర్‌ఎస్‌, టిఆర్‌ఎస్‌ అంటే కెసిఆర్‌ అన్నట్లు అందరినోళ్ళలో గత రెండున్నర దశాబ్దాలుగా నలిగిన ఈ పేరు తెరచాటు కానుందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. గొప్ప రాజకీయ వేత్తగా, మాటల మాంత్రికుడిగా పేరుగడిరచిన కెసిఆర్‌ ప్రాపకంకోసం అర్రులు చాచినవారిప్పుడు ఆయనను ఒక్కొక్కరుగా వొదులుకోవడాన్ని చూస్తుంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశంలోకూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే టిఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించిన నాటినుంచి దేశరాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను కెసిఆర్‌ చాటుకున్నారు. తెలంగాణసాధన క్రమంలో దేశంలోని ప్రధాన పార్టీలన్నిటితో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు విషయంలో వారి మద్దతును సేకరించిన కెసిఆర్‌, ఆ తర్వాత కాలంలో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పి జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను కూడగట్టే విషయంలో విఫల యత్నంచేశారు. అయినా రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న మహారాష్ట్ర, ఏపిల్లో పార్టీ విస్తరణతో జాతీయ పార్టీగా భవిష్యత్‌లో గుర్తింపుతెచ్చుకోవాలనుకున్న కెసిఆర్‌కు ఇప్పుడు సొంత ఇంటిలోనే పార్టీ మనుగడ ప్రమాదంలో పడిరది.
రాష్ట్రసాధనలో కెసిఆర్‌ను అంటిపెట్టుకుని ఉన్నవారు, కెసిఆర్‌ ఏరికోరి ఇతర పార్టీలనుండి తెచ్చుకున్నవారు, కెసిఆర్‌ పాలనపై మక్కువ పెంచుకున్నవారిప్పుడు ఆయనను  వదిలివేస్తున్నారు. వీరిలో సిట్టింగ్‌ ఎంపిలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,  మున్సిపల్‌ మేయర్లు, కార్పోరేటర్లు, వివిధ సంస్థల చైర్మన్లు  ఇతర పార్టీలకు క్యూ కడుతున్నారు. వీరిలో చాలామంది కాంగ్రెస్‌ కండువ కప్పుకుంటుండగా, మరి కొందరు బిజెపిలో చేరిపోతున్నారు. విచిత్రమేమంటే మరికొందరు కాంగ్రెస్‌ టచ్‌లో ఉంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బహిరంగానో, చాటుగానో కలిసివొస్తున్నారు. తమ కోరికలను నెరవేర్చే పరిస్థితిలో వెంటనే పార్టీ ఫిరాయింపుకు సిద్ధపడుతున్నారు.  ఆ విధంగా వివిధ జిల్లాలకు చెందిన ప్రధమ,ద్వితీయ,తృతీయ శ్రేణి నాయకులు బిఆర్‌ఎస్‌ పార్టీని వీడిపోతుంటే పార్టీ అధినాయకత్వం అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించడంలేదంటే పార్టీ పరిస్థితిని ఊహించుకోవొచ్చు. ఈ పరిస్థితిలో త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసేందుకు నాయకులు ముందుకు రాకపోవడం గమనార్హం. ఒకనాడు పార్టీ టికట్‌ కోసం పోటాపోటీపడేవారు, నేడు పోటీ చేయడానికే వెనుకాడుతున్నారంటే పార్టీ ప్రతిష్ట ఎంత దిగజారిపోయిందన్నది అర్థమవుతున్నది. చేవెళ్ళ సిట్టింగ్‌ ఎంపి రంజిత్‌రెడ్డి తాను మరోసారి పోటీచేయడానికి సిద్ధంగాలేనని ముందుగానే అధిష్టానానికి చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే.
చాలాకాలంగా నల్లగొండ ఎంపీ స్థానంలో తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వొచ్చిన శాసనమండలి చైర్మన్‌  గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పుడు మౌనం వహించారు. అక్కడినుండి పోటీచేసేందుకు తనకు ఇష్టంలేదని చెబుతున్న అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌ టచ్‌లో ఉన్నట్లు వార్తలు వొస్తున్నాయి. మాజీమంత్రి తలసాని యాదవ్‌ కుమారుడు సాయికూడా మొదట్లో చూపించిన ఉత్సాహాన్ని కనబర్చడంలేదు. మల్కాజిగిరిలో తన కుమారుడు భద్రారెడ్డిని బరిలోకి దించుతానని ఘంటాపథంగా చెప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంనుండి ఎదురైన పరిస్థితులతో తన కుమారుడు పోటీచేయడని స్పష్టంచేస్తున్నారు. కాగా ఇప్పటికే పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపి వెంకటేశ్‌నేత తనకు మరో అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిపోయారు. అలాగే నాగర్‌కర్నూల్‌. జహిరాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీలు కాషాయ పార్టీలో చేరిపోయారు. కాగా తాజాగా బిఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు సీతారామ్‌నాయక్‌, గోడం నగేళ్‌లు కూడా బిజెపిలో చేరడమేకాదు, మరోసారి ఎంపీలుగా పోటీచేసే హామీని కూడా పొందటం విశేషం. వీరితోపాటు మాజీ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  జలగం వెంకట్రావ్‌, శారంపూడి సైదిరెడ్డిలకు కూడా పోటీచేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బిజెపి వర్గాలద్వారా తెలుస్తున్నది. పెద్దపల్లికి చెందిన టిపిసీసీ ప్రధాన కార్యదర్శి గోమాస శ్రీనివాస్‌కూడా వీరికి జత కలిశారు. ఇదిలాఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి,గూడెం మహిపాల్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాణిక్యరావు, తాజాగా ప్రకాశ్‌గౌడ్‌, కాలె యాదయ్యలు ముఖ్యమంత్రిని కలవడం తెలిసిందే. ఎల్‌బి నగర్‌ ఎమ్మెల్యే  రేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కూడా త్వరలో సిఎంను కలుస్తారని టాక్‌. ఇక వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, పలువురు కార్పోరేటర్లు, చేవెళ్ళ జడ్‌పి చైర్మన్‌ సునీత మహేందర్‌రెడ్డి, ఆమె భర్త, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్‌ పర్సన్‌  తోపాటు మాజీ మేయర్‌ బొంతు రాంమ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, ఆమె భర్త శోభన్‌రెడ్డి, సిర్పూర్‌ ఎమ్మెల్యే  కోనేరు కోనప్ప ఇప్పటికే కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. కాగా నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్‌ మాజీ ఎమ్మెల్యే  విఠల్‌రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే  పైళ్ళ శేఖర్‌రెడ్డిలు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు వినికిడి.
ఈ పరిస్థితిలో తన రాజకీయ చతురతతో దిల్లీలో  చక్రం తిప్పాలనుకున్న బిఆర్‌ఎస్‌కు లభించే స్థానాలెన్ని అన్నది ప్రశ్నగా మిగిలింది. అధికారంలో ఉన్నప్పుడు తనను, కాంగ్రెస్‌ను కెసిఆర్‌ పెట్టిన ఇబ్బందికి బదులు తీర్చుకోవడానికి సిఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. తాము అధికారంలోకి వొచ్చి మూడు నెలలుకూడా పూర్తికాకుండానే బిఆర్‌ఎస్‌తో పాటు బిజెపి కూడా కాంగ్రెస్‌ అధికారం కోల్పోతుందంటూ చేస్తున్న వ్యాఖ్యానాలపైనా ఆయన సీరియస్‌ అవుతున్నారు. తనను ముట్టుకుంటే ఫాం హౌజ్‌ ఇటికలు కూడా మిగలవని ఆయన కెసిఆర్‌ను హెచ్చరిస్తున్నారు. ఒకవైపు అధికార కాంగ్రెస్‌, మరోవైపు భారతీయ జనతాపార్టీ దూకుడు మధ్యలో కారు నలిగిపోతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *