కరీంనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీభాష్యం విజయసారథి బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురై స్వగృహంలో మృతి చెందారు. ఇరుకుల్ల గ్రామ సవి•పంలోని పద్మనాయక శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు జరిగాయి. సంస్కృతంలో అనేక కావ్యాలు రచించిన విజయసారథి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. 2021లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల వి•దుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
సంస్కృతంలో దక్షిణ భారత దేశం నుంచి ఈ అత్యున్నత అవార్డును అందుకున్న ఏకైక కవి విజయసారథి మాత్రమే. ముఖ్యమంత్రి కేసీఆర్ పై రచించిన చంద్రశేఖర ప్రశస్తిః ఎంతో ప్రాచూర్యాన్ని పొందింది. 1936 మార్చి 10 న కరీంనగర్ మండలం చేగుర్తి గ్రామంలో గోపమాంబ, నరసింహాచార్య దంపతులకు జన్మించిన విజయసారథి సంస్కృత భాషలో కూలంకషమైన పాండిత్యంతోపాటు కవిత్వంలోనూ తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు.
సంస్కృతసాహిత్యానికి లోటని సిఎం కెసిఆర్ సంతాపం
మహాకవి, సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, కరీంనగర్కు చెందిన పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి మృతి చెందారు. ఆయన పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశ సంస్కృత భాషా పాండిత్యానికి తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. శ్రీభాష్యం విజయసారథి సాహితీ సేవను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
కవిత్వ సృజనతో పాటు, రాగయుక్తంగా కవిత్వాలాపన చేయడంలో శ్రీభాష్యం గొప్ప ప్రతిభను ప్రదర్శించేవారని అన్నారు. వర్తమాన కవులకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం తెలిపారు. కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మృతికి జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్, ఇతర ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.



