- రూ 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
- భూత్పూర్ అమిస్తాపూర్ వద్ద బహిరంగ సభ…పోలీసుల భారీ బందోబస్తు
- ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డికె అరుణ
మహబూబ్నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : విశ్వగురుగా పేరుగాంచిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా రూ 13 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం భూత్పూర్ అమిస్తాపూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తారు. కాగా మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డికె అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును చేపట్టారు. బహిరంగ సభకు లక్షకు పైగా ప్రజలు వొచ్చే విధంగా ఏర్పాట్లను చేశారు.
మోదీ పర్యటన షెడ్యూల్ను పరిశీలిస్తే…మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు మోదీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్లో బయలుదేరి రెండు గంటలు ఐదు నిమిషాలకు పాలమూరు చేరుకోనున్నారు. రెండు గంటల యాభై నిమిషాల వరకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం మూడు గంటలకు బహిరంగ సభా స్థలికి చేరుకుని ప్రసంగిస్తారు. మోదీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 7గురు జిల్లా ఎస్పీలు, 8 మంది అడిషనల్ ఎస్పీలు, 17 మంది డిఎస్పీలు, 55 మంది సిఐలు, 170 ఎస్సైలు, 1640 మంది ఏఎస్ఐలు, మరో వెయ్యి మంది పైగా హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్ సిబ్బంది భద్రత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.




