- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వాతంత్య్ర దినోత్సవ సందేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: దేశ చరిత్రలోని ఈ ప్రత్యేక రోజున ప్రియమైన భారత పౌరులందరికీ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హృదయపూర్వక శుభాకాంక్షలు, హార్థిక అభినందనలు తెలిపారు. అనేకమంది దేశభక్తులను గౌరవిస్తూ ఆత్మవిమర్శ చేసుకునే మహత్తర సందర్భమన్నారు. వారు చూపిన అచంచలమైన ధైర్యం, అప్రతిహతమైన విశ్వాసం, త్యాగం మన భవిష్యత్తుకు మార్గం సుగమం చేసింది. వారి త్యాగాలు మన స్వేచ్ఛకు శాశ్వతమైన పునాదులని పేర్కొన్నారు. మన త్రివర్ణ పతాకానికి గౌరవప్రదంగా వందనం చేస్తున్న ఈ క్షణంలో బలమైన, స్వావలంబనతో కూడిన ఆత్మనిర్భర్ భారతాన్ని నిర్మించేందుకు మనమందరం మళ్ళీ కట్టుబడుదామన్నారు. అందరికీ సమానంగా శాంతి, సుసంపన్నత కలిగే భారతాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఈ రోజు మనం ఐకమత్యం, సమగ్రత, అభివృద్ధి అనే జ్యోతిని వెలిగిస్తూ మెరుగైన రేపటి వైపు కలసి ముందుకు సాగుదామన్నారు. త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ ఆకాశంలో ఎగురుతూ ఉండాలి. దాని మూడు రంగులు మన హృదయాలలో ధైర్యం, శాంతి, విశ్వాసం అనే శాశ్వత విలువలను నింపాలని ఆకాంక్షించారు.
మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం
తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం లభించింది. ఆర్డినెన్స్ 3కి గవర్నర్ ఆమోదం లభించడంతో న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రీశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులకు సైతం వోటు హక్కు కల్పించేలా తెలంగాణ మున్సిపల్ చట్టంలోని సెక్షన్-20కి సవరణ చేశారు.





