హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28 : క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడారని తెలిపారు. పీవీ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెల్లడించారు.
తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని చెప్పారు. పీవీ స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ అన్నారు. పీవీ నరసింహారావు) ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల అభివృద్ధి ఫలాలు మనం అనుభవిస్తున్నామని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. పీవీ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో ఉన్న శాసన మండలిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ పాల్గొన్నారు.




