- మార్చి నెలలో దుద్దెడకు, మే నెలలోపు సిద్ధిపేటకు రైలు
- 11కిలో మీటర్ల రైల్వే ట్రాక్ లైను పనులను పరిశీలించిన మంత్రి హరీష్రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: సిద్ధిపేటకు రైల్వే ఏర్పాటు దశాబ్దాల కల. ఆ రైల్వే కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సాకారం చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు చెప్పారు. మార్చి నెలలో దుద్దెడక• రైలు వొస్తుందనీ, ఏప్రిల్, మే నెలలోపు సిద్దిపేటకు రైలు వొచ్చేలా వేగంగా పనులు జరుగుతున్నాయని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. మంగళవారం సిద్ధిపేట రైల్వే స్టేషన్ నుండి నిర్మాణంలో ఉన్న దుద్దెడ రైల్వే స్టేషన్ వరకూ దాదాపు 11 కిలో మీటర్ల మేర జరుగుతున్న రైల్వే ట్రాక్ లైను పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ సుదర్శన్ రెడ్డి, ఎస్ఈ ఎలక్ట్రిసిటీ ప్రభాకర్, ఇరిగేషన్ మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ…ఇప్పటికే ఫేస్ 1 ద్వారా హైదరాబాద్ నుండి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ వరకు 44 కిలోమీటర్లు రైలు సేవలు ప్రాంభమై రాకపోకలు సాగిస్తుందనీ, రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటు చేసి ఎరువులను తీసుకువచ్చి జిల్లాలోని అన్ని ప్రాంతాల రైతులకు ఎరువులను సరఫరా చేస్తున్నామనీ, దీంతో ఎరువులను తీసుకురావడానికి సనత్నగర్ రేక్ పాయింట్కు వెళ్లాల్సిన శ్రమ తగ్గిందన్నారు. ఫేజ్-2 ద్వారా గజ్వేల్ నుండి సిద్దిపేట వరకు పనులు వేగంగా జరుగుతున్నాయనీ, గజ్వేల్ నుండి దుద్దెడ వరకు 21 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తి కావస్తుందనీ, దుద్దెడ నుండి సిద్దిపేటకు 11 కిలోమీటర్లు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. దుద్దెడ రైల్వే స్టేషన్ ద్వారా కలెక్టర్ కార్యాలయం, ఐటి టవర్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్సిట్యూట్కు వొచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఫేజ్-3 ద్వారా సిద్ధిపేట నుండి సిరిసిల్లకు, ఫేజ్-4 ద్వారా సిరిసిల్ల నుండి వేములవాడ మీదుగా కరీంనగర్ వరకు రైల్వే లైన్ పూర్తవుతుందన్నారు.
2005-2006లో యూపిఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూలదనం వాటాగా మొత్తం ఖర్చు భరించి భూసేకరణ, రైల్వే ఏర్పాటుకు అవసరమైన నిధులలో మూడో వంతు సమకూర్చడం, రైల్వే నిర్మాణం అనంతరం 5 సంవత్సరాలపాటు రైల్వేకు వచ్చే నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం భరించడం అనే అగ్రిమెంట్తో మనోహరాబాద్ నుండి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కొత్తపల్లి కరీంనగర్ వరకు 151 కిలోమీటర్ల రైల్వేను మంజూరు చేయించారన్నారు. కానీ, 2014 వరకు 8 సంవత్సరాలు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం వాటాగా చెల్లించాల్సిన నిధులు చెల్లించకపోవడం, భూసేకరణ చేయకపోవడం మూలంగా 2014 వరకు రైల్వే ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి పనులు ప్రారంభం కాలేదన్నారు. గతంలో ఎంపీలు గడ్డం వెంకటస్వామి, నంది ఎల్లయ్య, సర్వే సత్యనారాయణ సిద్దిపేటకు రైల్వే తీసుకొస్తామన్నారు. కానీ ఎవరు తీసుకురాలేదన్నారు. కానీ, 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేసీఆర్ మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు మంజూరు చేసి భూ సేకరణ చేయడంతో రైల్వే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వేగంగా రైల్వే ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు.
రైల్వే పనుల నిర్మాణంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే ఏర్పాటుకు కావలసిన మొత్తం భూసేకరణ, అయ్యే మొత్తం ఖర్చులో మూడవ వంతు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందనే అగ్రిమెంటుకు అనుగుణంగా ఇప్పటికి 500 కోట్ల రూపాయలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖర్చు చేశామన్నారు. 2200 ఎకరాల భూసేకరణ పూర్తి చేశామనీ, మరో 300 నుండి 350 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. మెదక్ జిల్లాలో 171 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 1342 ఎకరాలు, సిరిసిల్ల జిల్లాలో 708 ఎకరాలు మొత్తం ఖర్చు భరించి రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందన్నారు. భూసేకరణకు మెదక్ జిల్లా పరికిబండ వద్ద పారెస్ట్ క్లియరెన్స్ ప్రాబ్లమ్ వస్తే అవసరమైన నిధులు ఖర్చు చేసి క్లియర్ చేసామన్నారు. మనోహరాబాద్ వద్ద నేషనల్ హైవే ఆర్వోబి నిర్మాణానికి సమస్య వస్తే ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఢిల్లీలో ఉన్నతాధికారులను కలిసి పని పూర్తి చేశామన్నారు.
రైల్వే పనులు వేగంగా జరగడానికి రైల్వేకు మరో 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంజూరు చేస్తామన్నారు. రైల్వేకు అందించిన 500 కోట్ల రూపాయలతో పాటు కుకునూరుపల్లి, మందపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, మిషన్ భగీరథ పైప్ లైన్లను మార్చడానికి, ఇరిగేషన్ కెనాల్స్ సరి చేయడానికి, కాళేశ్వరం ప్రాజెక్టు టన్నెల్, ఆడిట్స్ మార్చడం, విద్యుత్ టవర్లను మార్చడానికి, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి మరిన్ని నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. రైల్వే లైన్ ఏర్పాటుతో నష్టపోతున్న ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో ఇంటి స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇచ్చామన్నారు. రైల్వే శాఖ వారు పనుల్లో వేగం పెంచి డే అండ్ నైట్ వర్కస్ నిర్వహించి త్వరగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే ఈ ప్రాంత ప్రజల రవాణాకు మార్గం సుగమమై ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యమైన రైల్వే రవాణా మార్గం ఇది అని, ఈ రైల్వే లైన్లో గూడ్స్, ప్యాసింజర్ రైల్లు నడుస్తాయనీ, భవిష్యత్తులో ఈ లైన్ ఉత్తర దక్షిణాదిని ముఖ్యమైన రైల్వే మార్గంగా రూపుదిద్దుకుంటుందన్నారు. గేట్వే ఆఫ్ ఇండియాగా మారనుందనీ, సుమారు 75 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. రైల్వే లైన్ నిర్మాణ పనులలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా అధికార యంత్రాంగం సహకరించడానికి సిద్ధంగా ఉందనీ, అధికారులతో కలిసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ప్రతి వారం వారం ప్రగతిని పరిశీలిస్తున్నామనీ, సమస్యలు నేరుగా జిల్లా కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకువెళ్లాలని సంబంధిత రైల్వే అధికారులకు మంత్రి హరీష్రావు సూచించారు.



