హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఫలితాలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజీ వర్సిటీ ఇంఛార్జి విసి నవీన్ మిట్టల్ విడుదల చేశారు. మొత్తం 96.90 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం టీజీ ఎడ్సెట్ పరీక్షను మే 23న నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 29,463 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా.. ఈసారి ఎడ్సెట్ పరీక్షలను నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించింది. రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో మొత్తం 14,285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఎడ్సెట్ హాల్టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎడ్సెట్ ప్రవేశ పరీక్షలో మొత్తం 96.90 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ఎడ్సెట్ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 26,994 అభ్యర్థులు (98.18శాతం ) ఉత్తీర్ణత సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 23న రెండు సెషన్లలో టీజీఎడ్సెట్-2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్లో ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి సెషన్లో నిర్వహించిన పరీక్షకు 16,929 మందికి గానూ 14,633 మంది, రెండో సెషన్ 16,950 మందికి గానూ 14,830 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 87శాతం హాజరు శాతం నమోదైంది. ఈ ఏడాది నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎడ్సెట్ పరీక్షల బాధ్యత చేపట్టింది. ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా రెండేళ్ల బీఎడ్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో మొత్తం 14285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.





