- పోటీకి జనసైనికులు సిద్దం కావాలి
- కొండగట్టు నుంచే యాత్ర మొదలు పెడతా
- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి
తెలంగాణలోనూ జన సైనికులు సిద్ధంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. త్వరలోనే కొండగట్టు నుంచి యాత్ర మొదలు పెడుదాం.. గట్టిగా పని చేయాలని రాష్ట్రంలోని పార్టీ క్యాడర్ కు ఆయన సూచించారు. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే శ్రీకాంతాచారి లాంటి అమరుల త్యాగాలు వృథా అవుతాయన్నారు. పోరాటం చేసే ధైర్యం తనకు తెలంగాణ గడ్డ నుంచే వచ్చిందని పేర్కొన్నారు. వేలాది మంది ఆత్మబలిదానం, త్యాగాల వల్ల తెలంగాణ ఏర్పడింది.. నాకు స్ఫూర్తినిచ్చే గడ్డ తెలంగాణ అని పవన్ వ్యాఖ్యానించారు. నాది ఆంధ్ర అనే భావన ఆంధ్రవాళ్లకు లేదు. దీనికి కారణం ఏపీలో చరిత్ర చెప్పేవాళ్లు లేరు. వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కోసం ఆంధ్ర నుంచి తెలంగాణ దాకా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఏపీలో కొంతమందికి కోపం రావడం లేదని పేర్కొన్నారు. ఏపీలోని మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 7 నుంచి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు. కొండగట్టు నుంచి తెలంగాణలో రాజకీయం మొదలు పెడతామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ్టి నుంచి ఇక యుద్ధమే అని స్పష్టం చేశారు. ఏపీలో జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోందని.. సీఎం అయితే రాష్టాన్న్రి అభివృద్ధి చేయడంతో పాటు వైసీపీ తాట తీస్తానని వెల్లడించారు.
తప్పుడు మాటలు మాట్లాడితే నిలబెట్టి తోలు వలుస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. సిద్ధంగా ఉండండి. వైసీపీ నేతలు ఉత్తరాంధ్రలో పర్యటించారా ? వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా కృషి చేస్తా. కార్మిక సంఘ నేతలు ముందుకు రావాలి. బీజేపీ, ప్రధాని అంటే గౌరవం ఉంది.. కానీ వాళ్లకు ఊడిగం చేయం. మంత్రులపై దాడులు జరిగాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ వద్దకు నా బృందం వెళుతుంది. నేనేం లండన్ లో న్యూ యార్క్ లో పెరగలేదు’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.




