న్యూ దిల్లీ, ఆగస్ట్ 28 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి ఉపరితలంపై రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా అధ్యయనం కొనసాగిస్తున్న వేళ ఎవరికితోచిన విధంగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తున్నారు. చందమామను ’హిందూ రాజ్యం’గా ప్రకటించాలని వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధిగాంచిన ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు.చంద్రయాన్-3 స్పేస్క్రాప్ట్ ల్యాండింగ్ జరిగిన ప్రాంతాన్ని రాజధాని చేయాలని అన్నారు. ఇతర మతాలు ఈ డిమాండ్ చేయకముందే భారత ప్రభుత్వం చందమామపై తన యాజమాన్యాన్ని ప్రకటించాలన్నారు.
అంతేకాదు ఇందుకోసం పార్లమెంట్లో తీర్మానాన్ని కూడా ఆమోదింపజేయాలని సూచన కూడా చేశారు. ఈ మేరకు స్వామి చక్రపాణి మహారాజ్ సోషల్ డియాలో ఒక వీడియో షేర్ చేశారు. చంద్రుడిని హిందూ రాజ్యంగా ప్రకటించే విషయంలో భారత ప్రభుత్వం సత్వరమే స్పందించాలన్నారు. భారత్ ప్రభుత్వం త్వరగా ఈ మేరకు చర్యలు తీసుకుంటే అక్కడికి (చంద్రుడి) ఉగ్రవాదులు ఎవరూ చేరుకోలేరని అన్నారు. దిలావుండగా.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ అయిన ప్రాంతానికి ’శివ శక్తి పాయింట్’గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామకరణం చేసిన విషయం తెలిసిందే.



